పింకు బుక్ మెయింటెన్ చేస్తున్నాం.. అందరి లెక్కలు తేలుస్తామని కవిత వార్నింగ్
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేసిన వారి చిట్టా పింకు బుక్లో రాస్తామని... టైం వచ్చినప్పుడు అందరి సంగతి తేలుస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ఈ మేరకు కొల్లాపూర్ మండలం సింగోటంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె పర్యటించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రి జూపల్లిపై విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది.
స్థానికంగా ఉన్న లింగాకార లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కోసం గతంలో కేసీఆర్ రూ.17 కోట్లు మంజూరు చేస్తే.. ఆ నిధులను జూపల్లి కృష్ణారావు రద్దు చేయడం దారుణమని పేర్కొన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు స్వామివారి దగ్గరికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారని ఆమె తెలిపారు. ఒక ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలు ఇంకొక ప్రభుత్వంలో కొనసాగాలని.. వాటితో ప్రజలకు లాభం జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తక్షణమే క్యాన్సిల్ చేసినటువంటి డబ్బుల్ని తీసుకొని వచ్చి ఆలయ అభివృద్ధి కోసం జూపల్లి కృష్ణారావు కృషి చేయవలసిందిగా డిమాండ్ చేశారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆమె అన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. నిన్న రాత్రి సాతపూర్ గ్రామంలో ఇవాళ మీటింగ్ కోసం ఫ్లెక్సీ కడుతుంటే బీఆర్ఎస్ కార్యకర్త పరమేష్పై దారుణంగా 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కలసి దాడి చేశారన్నారు. సీఎం సొంత జిల్లా అయినప్పటికీ కేసుల విషయంలో పురోగతి లేకపోవడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడకుండా హంతకులకు కొమ్ముగాస్తుందని విమర్శించారు.
ఇక జూపల్లి కృష్ణారావు టూరిజం మంత్రిగా కాకుండా కొల్లాపూర్ నియోజక వర్గానికి అప్పుడప్పుడు వస్తూ టూరిస్ట్ మంత్రిగా వ్యవహారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు నియోజకవర్గంలో పండే మామిడికాయలను దేశంలోని నలుమూలాలతో పాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి జరుగుతాయని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో కొల్లాపూర్ ప్రాంతంలో మామిడి మార్కెట్ మంజూరు చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications