కత్తి తెస్తున్న చంద్రబాబుని వదిలేద్దాం, ఈ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
నల్గొండ/హైదరాబాద్/: ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ఆపద్ధర్మ సీఎంకేసీఆర్ వరుసగా పలు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. బుధవారం దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్ తదితర సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం మనకు ఎందుకని ప్రశ్నించారు. దేవరగొండ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఇద్దరు కాదు.. ముగ్గురు: మళ్లీ రేవంత్ సంచలనం వ్యాఖ్యలు, విశ్వేశ్వర్ రెడ్డి ఊహించని ట్విస్ట్
కష్టపడి మనం తెలంగాణను సాధించుకున్నామని, మళ్లీ ఆయనకు పెత్తనం ఇద్దామా అని ప్రశ్నించారు. తెలంగాణలో 13, 14 స్థానాల్లో టీడీపీ ఎందుకు పోటీ చేస్తోందని ప్రశ్నించారు. మాయమాటలు చెప్పే నేతల చెంప చెళ్లుమనిపించేలా ఎన్నికల్లో వారిని ఓడించాలన్నారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో జోక్యం
సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు రావాలని కేసీఆర్ చెప్పారు. గిరిజనులకు రిజర్వేషన్లపై ప్రధాని నరేంద్ర మోడీకి పలుమార్లు లేఖలు రాశానని చెప్పారు. గిరిజనులకు రిజర్వేషన్లు కచ్చితంగా ఇచ్చి తీరుతామని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకోబోతున్నామని చెప్పారు.
కేంద్రం మీద ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలి
కేంద్ర ప్రభుత్వం మీద ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరగాలని కేసీఆర్ చెప్పారు. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిజాయితీ కలిగిన నేతలను గెలిపించాలని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలిస్తే కరెంట్ పోతుందని, ప్రాజెక్టులు ఆగిపోతాయని చెప్పారు. తెలంగాణ మళ్లీ చికట్లోకి వెళ్తుందని చెప్పారు. తెలంగాణ పోరాటం ఇంకా అయిపోలేదని చెప్పారు.
దేశమే ఆశ్చర్యపోయింది
దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా 24 గంటలు కరెంట్ ఇచ్చామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. దేశమే ఆశ్చర్యం వ్యక్తం చేస్తోందన్నారు. అవినీతికి దూరంగా, పైరవీలకు ఆస్కారం లేకుండా పాలించామని చెప్పారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని అందరం ప్రత్యక్షంగా చూశామని చెప్పారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు.
చంద్రబాబు రూపంలో మరో ఆపద
కానీ ఇప్పుడు చంద్రబాబు రూపంలో తెలంగాణకు మరో ఆపద తరుముకొస్తోందని కేసీఆర్ అన్నారు. తెలంగాణపై ఆయన పెత్తనం అవసరం లేదని చెప్పారు. ఏపీకి వెళ్లిన చంద్రబాబును కాంగ్రెస్ భుజాన వేసుకొని వస్తోందని చెప్పారు. నన్ను కొట్టడానికి చేతకాక, ద్రోహం చేస్తున్న చంద్రబాబు వెనుకబడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీ సన్నాసులు మళ్లీ అమరావతికి బానిసలను చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ గోడలు గీకుతోందన్నారు.
కత్తి తీసుకొస్తున్న చంద్రబాబును వదిలేద్దాం
తనను ఒంటరిగా ఓడించలేక తనను కొట్టేందుకు చంద్రబాబును కాంగ్రెస్ నేతలు తీసుకు వస్తున్నారని, 'కత్తి ఆంధ్రావాడు ఇస్తాడు, పొడిచేవాడు తెలంగాణవాడని' తాను ఉద్యమం సమయంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. కత్తిని చంద్రబాబు తీసుకువస్తే, తీసుకు వచ్చేది కాంగ్రెస్ నాయకులేనని అన్నారు. కత్తి ఇచ్చే చంద్రబాబును వదిలేద్దామని, కానీ తీసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు లేకుండా చేద్దామని చెప్పారు. చంద్రబాబును తీసుకు వస్తోంది నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలేనని చెప్పారు. మహాకూటమి ఎన్ని మాయలు, ప్రయత్నాలు చేసినా గెలవదని కేసీఆర్ చెప్పారు.
నేను ఢిల్లీకి వెళ్తానని కాదు
ఈ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని, అంటే తాను ఢిల్లీకి వెళ్తానని కాదని, తెలంగాణలోనే ఉండి కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తానని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రాల హక్కులను కాపాడేందుకు తానీ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. బీజేపీక, కాంగ్రెస్ ఇద్దరూ దొందూ దొందే అన్నారు. ఆ రెండు పార్టీల జెండాల రంగులు మాత్రమే మారాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెసేతర, భాజపాయేతర ప్రభుత్వం కేంద్రంలో రావడానికి ఈ ఎన్నికల తర్వాత ప్రయత్నం చేస్తామన్నారు.