'ఎమ్మెల్సీ' ఓటమి కేసీఆర్కు ముందే తెలుసు... అందుకే ఇప్పటివరకూ... బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు...
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవబోతుందని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అన్ని సర్వేలు ఇదే విషయం చెప్తున్నాయన్నారు. బీజేపీ గెలుస్తుందని తెలుసు కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటివరకూ ఓటు వేయమని ఓటర్లను అడగలేదన్నారు. ఓట్లు అడగని వ్యక్తికి,అంత అహంకారికి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. బీజేపీని గెలిపించకపోతే కేసీఆర్ అహంకారాన్ని ఎవరూ అడ్డుకోలేరని... రాష్ట్రంలో అరాచక పాలనను అడ్డుకోవడం కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు.

ఉద్యోగ సంఘాలను కేసీఆర్ మభ్యపెడుతున్నాడు : బండి సంజయ్
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎక్కడ సమావేశాలు పెట్టినా వేల సంఖ్యలో జనం తరలి వస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్పై ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పటికే ఇంటలిజెన్స్ వర్గాలు కేసీఆర్కు చెప్పాయని అన్నారు.ఓడిపోతున్నామని తెలుసుకుని ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వడం అందులో భాగమేనని అన్నారు. ఒకవేళ కేసీఆర్ పీఆర్సీ ఇచ్చేందుకు సిద్దమైతే... అందుకు అనుకూలంగా ఈసీతో మాట్లాడేందుకు తాము కూడా సిద్దమేనని అన్నారు. కానీ కేసీఆర్కు ఆ ఉద్దేశం లేదని,మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను మోసం చేస్తాడని ఆరోపించారు.

బీజేపీ వల్లే ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్...
తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించే పరిస్థితి లేదన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఫించన్లు అందట్లేదన్నారు. బీజేపీ హెచ్చరిస్తే తప్ప ప్రభుత్వం నుంచి చర్యలు ఉండట్లేదన్నారు. బీజేపీ పోరాటం వల్లే కేసీఆర్ ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్ ఇచ్చారని... ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇదే చర్చించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఎవరూ ధర్నాలు,నిరసనలు చేయకుండా నియంత్రుత్వంతో వ్యవహరించారని ఆరోపించారు. కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం బీజేపీ వల్లేనని అన్నారు.

కేసీఆర్కు అది అలవాటే...
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతసేపు అబద్దాలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. నిజాం సుగర్ ఫ్యాక్టరీ,అజంజాహి మిల్లును మళ్లీ తెరుస్తామని చెప్పిన కేసీఆర్ ఆ హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు,నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఇవన్నీ అమలుచేయని వ్యక్తి ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ అమలుచేస్తానంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కేసీఆర్ దానిపై ఎక్కడా స్వయంగా హామీ ఇవ్వలేదు కాబట్టి... రేప్పొద్దున మాట తప్పరన్న గ్యారెంటీ లేదన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి హామీలు ఇవ్వడం... ఆ తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకపోవడం కేసీఆర్కు అలవాటేనని మండిపడ్డారు.

సమస్యలపై స్పందించడు,ఆపదలో ఉన్నప్పుడు రాడు...
అభివృద్దిపై చర్చకు సవాల్ విసిరితే టీఆర్ఎస్ నుంచి ఇంతవరకూ స్పందన లేదన్నారు. ప్రశ్నించే గొంతులు వద్దు పరిష్కరించే గొంతులు కావాలని టీఆర్ఎస్ నేతలు చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. అదే నిజమైతే కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ అని... రాష్ట్రంలో పనులు జరగాలంటే బీజేపీనే గెలిపించాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తప్ప ఎవరు గెలిచినా టీఆర్ఎస్కు కొమ్ము కాస్తారని ఆరోపించారు. ఓడిపోతామనే తెలిసి కొంతమంది ఇండిపెండెంట్లను దింపారని ఆరోపించారు. నడిరోడ్డుపై న్యాయవాద దంపతుల హత్య జరిగితే కేసీఆర్ ఇంతవరకూ స్పందించలేదన్నారు. భైంసా ఘటనపై ఇంతవరకూ మాట్లాడలేదన్నారు. సమస్యలపై స్పందించని ముఖ్యమంత్రి... ఆపదలో ఉన్నప్పుడు రాని ముఖ్యమంత్రి ఇక ఎందుకని ప్రశ్నించారు. కాబట్టి కేసీఆర్ అహంకారాన్ని దెబ్బ కొట్టాలంటే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసినా బీజేపీ భారీ మెజారిటీతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications