నల్ల పిల్లితో కేసీఆర్ క్షుద్ర పూజలు - ఫామ్హౌస్లో నరబలి..!!
హైదరాబాద్: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ప్రచార పర్వం పతాక స్థాయికి చేరుకుంది. అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు-ప్రతి వ్యూహాలతో తలమునకలై ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో అన్ని పార్టీలు విజయం కోసం సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. పార్టీలు, అభ్యర్థుల మధ్య పరస్పరం ఆరోపణలు-ప్రత్యారోపణలు తీవ్రతరం అయ్యాయి.

అభ్యర్థులు రెడీ..
ఇదివరకు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరడం వల్ల ఉప ఎన్నిక అవసరమైంది. రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసింది. ఈ మేరకు ఈ ఉదయమే అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి పోటీ చేస్తోన్నారు. టీఆర్ఎస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఈ ఉప ఎన్నిక బరిలో దింపింది. 2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గానికి ఆయన ప్రాతినిథ్యం వహించారు.

బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు..
ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ తన విమర్శల తీవ్రతను పెంచారు. ఆరోపణలను మరింత పదును పెట్టారు. తాజాగా భారత రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్పై వ్యక్తిగత దాడికి దిగారు. కేసీఆర్ చేతబడి చేస్తోన్నారంటూ ఆరోపించారు. తన ఫామ్హౌస్లో తాంత్రిక పూజలు నిర్వహిస్తోన్నారంటూ ధ్వజమెత్తారు. ప్రతి మూడు నెలలకోసారి నల్ల పిల్లితో కేసీఆర్ తన ఫామ్హౌస్లో తాంత్రిక పూజలు చేస్తుంటారని విమర్శించారు.

వందశాతం వాస్తవం..
తాను చెప్పేది జోక్ కాదని, వందశాతం వాస్తవం అంటూ బండి సంజయ్ తన విమర్శలను సమర్థించుకున్నారు. కేసీఆర్ ఫామ్హౌస్లో ముగ్గురు వర్కర్లు మరణించారని ఆయన గుర్తుచేశారు. అంతకుముందు ఓ యువకుడు కూడా చనిపోయాడని, ఇది బలి కావొచ్చని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందని బండి సంజయ్ చెప్పారు. ఇలాంటి పూజలన్నీ చేసిన తరువాతే కేసీఆర్ తన స్వార్థం కోసం టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాడని విమర్శించారు.

అధికారం కోసం..
తాను మళ్లీ అధికారంలోకి రావాలని కేసీఆర్ క్షుద్రపూజలు చేశాడని బండి సంజయ్ ఆరోపించారు. దేశం బాగుండాలని కోరుకోవట్లేదని, తాను, తన కుటుంబం అధికారంలోనే ఉండాలని, లక్షల కోట్ల రూపాయలను దోచుకోవాలనేదే లక్ష్యమని ధ్వజమెత్తారు. దీనికోసం ఎంతటికైనా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం తెగిస్తుందని మండిపడ్డారు. క్షుద్రపూజలు చేసేంతటి నీచ స్థాయికి దిగజారిందని ఆరోపించారు. కేసీఆర్ తల కింద తపస్సు చేసినా ఆ పూజలేవీ ఫలించవని జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications