మోడీ రాహుల్గాంధీల కంటే ప్రధానిగా అన్ని అర్హతలు ఆయనకే ఉన్నాయి: ఓవైసీ
హైదరాబాదు: బీజేపీ కాంగ్రెస్లు రెండు ఒక తానుకు చెందినవే అని అన్నారు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. ఈ రెండు పార్టీల నుంచి దేశానికి ప్రధాని అయ్యే అర్హతలు ఆ అభ్యర్థులకు లేవని అన్నారు. ఇక దేశ ప్రధానిగా అన్ని అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ అర్హతలు సీఎం కేసీఆర్కు ఉన్నాయన్నారు. రెండు జాతీయ పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాయని ధ్వజమెత్తారు.
భగవంతుడు ఏమి తలుస్తాడో, ప్రజలు ఎలా నిర్ణయిస్తారో తనకు తెలియదన్న ఓవైసీ.... మోడీ, రాహుల్, కేసీఆర్ ఈ ముగ్గురు నుంచి ప్రధాని అభ్యర్థి ఎన్నుకోమని తనను అడిగితే తాను కేసీఆర్కే ఓటు వేస్తానని ఓవైసీ చెప్పారు. మోడీ రాహుల్ గాంధీల కంటే రాజ్యాంగంపై ఎక్కువ అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు ఓవైసీ. తన వ్యాఖ్యలతో మోడీ మద్దతు దారులకు నిద్ర పట్టదన్న విషయం తనకు తెలుసనన్నరు ఓవైసీ. మరో సమావేశంలో కేసీఆర్ కూడా ప్రాంతీయ పార్టీలే మే 23 తర్వాత కేంద్రంలో అధికారంలోకి వస్తాయని చెప్పారు.
తెలంగాణలో టీఆర్ఎస్ 16 మజ్లిస్ ఒక సీటు గెలిస్తే కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీయేతర ప్రభుత్వం వస్తే తాము కీలకంగా మారే అవకాశం ఉంటుందన్నారు ఓవైసీ. తాము కేంద్రంలో మంచి పదవుల్లో ఉంటేనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిలో పయనిస్తుందని అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు దొందూ దొందే అని విమర్శించారు. మోడీ రాహుల్ కంటే దేశంలో మరింత మెరుగైన నాయకులు లేరా అని ప్రశ్నించారు. ప్రధాని పదవికి అర్హులైన అభ్యర్థుల జాబితా తీస్తే కచ్చితంగా అందులో కేసీఆర్ పేరే ఉత్తమమైన పేరుగా నిలుస్తుందన్నారు ఓవైసీ.