చంద్రబాబు, కేసీఆర్ వచ్చింది యూత్ కాంగ్రెస్ నుంచే!
హైదరాబాద్లోని గాంధీభవన్లో శుక్రవారం జరిగిన యూత్ కాంగ్రెస్ నేతల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్పై ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసే అందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్నారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత ఎక్కువగా పాల్గొనాలన్నారు. పార్టీలో కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందన్నారు. పైసలు ఉంటే ఎన్నికల్లో గెలవరని.. ప్రజా బలం ఉంటే గెలుస్తారని సీఎం రేవంత్ అన్నారు. పార్టీ కోసం కష్టపడకుండా కేవలం నాయకుల చుట్టూ తిరిగితే మాత్రం పదవులు రావని అన్నారు. గల్లీ నుంచి పోరాడితేనే ఢిల్లీ వరకు ఎదిగే అవకాశం వస్తుందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని.. వీరితోపాటు పార్టీలోని అగ్రనాయకులంతా వచ్చారని.. అది యూత్ కాంగ్రెస్ పవర్ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ బలం, బలగమని.. యూత్ కాంగ్రెస్ శక్తి ఏమిటో తమకు తెలుసని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని సీఎం రేవంత్ అన్నారు. కష్టపడి పనిచేస్తే పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని.. అనిల్ యాదవ్, బల్మూరి వెంకట్ ఇందుకు నిదర్శనమని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన వీరిద్దరికి పదవులు ఇచ్చామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో కేసీఆర్ ఊరించి మోసం చేశారని.. ఆయన మోసం చేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చారన్నారు. డబ్బులతో గెలిచే అవకాశం ఉంటే.. కేసీఆర్ 100 సీట్లు గెలిచేవారని.. సొమ్ముతో ఎన్నికల్లో గెలుస్తామనే భ్రమను వీడాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచే విధంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మిట్టప్లల్లి వెంకటేశ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.












Click it and Unblock the Notifications