కేసీఆర్, బాబులకు సోషల్ మీడియా గండం?: గట్టెక్కలేకనే అసహనం..
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు చిరాకు తెప్పిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇప్పటికే డైరెక్ట్ యాక్షన్ లోకి దిగారు. సోషల్ మీడియాను కట్టడి చేసే ప్రయత్న
హైదరాబాద్: మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అని చెబుతారు. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా పుట్టుకొచ్చింది. ఇది ఏ కుల రాజకీయాల చేతుల్లోనో.. పార్టీ అధినేతల చేతుల్లోను లేదు కాబట్టి.. అక్కడ జనం గొంతుకను ఆపడం ఎవరి తరం కాదు.
ఎవరో కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తారేమో కానీ.. చాలామంది స్వచ్చందంగా తమ అభిప్రాయాలను పంచుకునేవారే సోషల్ మీడియాలో ఎక్కువ. అవి రాజకీయాలు కావచ్చు. సినిమాలు కావచ్చు. ఇంకేదైనా..

ఒకవిధంగా ప్రధాన స్రవంతి పత్రికలు, మీడియా కూడా ప్రభుత్వాల వెనక నక్కి మాట్లాడుతున్న సందర్భంలో.. సోషల్ మీడియా ప్రజాగొంతుకగా నిలబడుతూ వస్తోంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది, ఇప్పటికీ అనేక ప్రజా ఉద్యమాలకు పురుడు పోస్తున్నది సోషల్ మీడియానే.
మీడియానైతే నయానో.. భయానో... దారికి తెచ్చుకోగలం కానీ ఈ సోషల్ మీడియాను తమకు అనుకూలంగా ఎలా మలుచుకోగలమన్నది నాయకులకు అంతుపట్టడం లేదు. ప్రలోభాలకు లొంగడానికి జుకర్ బర్గ్ ఇక్కడివాడేమి కాదు కాబట్టి.. సోషల్ మీడియా పెద్ద గండమై కూర్చొంది.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు చిరాకు తెప్పిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇప్పటికే డైరెక్ట్ యాక్షన్ లోకి దిగి..
సోషల్ మీడియాను కట్టడి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టేయగా, ఇప్పుడు కేసీఆర్ తన వ్యాఖ్యలతో ఎటాక్ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో రాతల్ని 'చిల్లర' అంటూ తీసిపారేశారు.
ఒకవిధంగా సోషల్ మీడియాను తాను ఓ కంట కనిపెడుతూనే ఉన్నానని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. కాబట్టి మున్ముందు సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు కేసీఆర్ కూడా ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు.
పాలనపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు.. ఎంతసేపు వ్యతిరేకత లేకుండా ఎలా కట్టడి చేయాలని ఆలోచించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతున్నట్లు అర్థమవుతుంది. ఒకరకంగా సోషల్ మీడియా వారిని ఉక్కిరిబిక్కిరి చేయడం వల్లే ఇంత అసహనానికి లోనవుతున్నారేమో!. అదే నిజమైతే ప్రభుత్వాలను వణికించే శక్తి సోషల్ మీడియాకు ఉందనేగా అర్థం?.












Click it and Unblock the Notifications