చంద్రబాబు, కెసిఆర్లు చిరకాల మిత్రులు, అమరావతితో నాంది: డీఎస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆహ్వానించడం ఆహ్వానించదగ్గ పరిణామం అని టిఆర్ఎస్ నేత డి శ్రీనివాస్ అన్నారు.
చంద్రబాబు, కెసిఆర్ ఇద్దరూ చిరకాల మిత్రులని ఆయన చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు సఖ్యతతో ముందుకు సాగడానికి అమరావతి కార్యక్రమం నాంది పలుకుతుందని డి శ్రీనివాస్ తెలిపారు.
ఇరు రాష్ట్రాలు కలసికట్టుగా అభివృద్ధి చెందాలని అభిలాషించారు. డీఎస్ను తెలుగుదేశం నేతలు కలసి, అమరావతి శంకుస్థాపనకు హాజరుకావాలంటూ బుధవారం ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.

ఇది ఇలా ఉండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఏపి రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా పర్యటన ఖరారైంది. గురువారం అమరావతితో సహా నల్గొండ, మెదక్ జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు సీఎం సూర్యపేట చేరుకుంటారు. గురువారం ఉదయం 10:15 గంటలకు సూర్యపేట నుంచి హెలికాప్టర్లో అమరావతికి బయలుదేరుతారు.
ఉదయం 10:45 గం.లకు అమరావతి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గం.ల వరకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 గంటలకు తిరిగి సూర్యపేటకు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు సూర్యపేటలో పర్యటిస్తారు. సూర్యాపేట గొల్లబజార్లో 2 పడకగదుల ఇళ్లకు సీఎం శంకుస్థాపన చేస్తారు.
సాయంత్రం 4:30గం.లకు హెలికాప్టర్లో దత్తత గ్రామం ఎర్రవెల్లికి బయలుదేరుతారు. ఎర్రవెల్లిలో దసరా వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ఎర్రవెల్లిలో డబుల్బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు మరో గ్రామం నర్సన్నపేటలో సిఎం కెసిఆర్ పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications