నేతిబీరకాయలో నెయ్యిలా మారిన నీతి ఆయోగ్
ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినప్పడు భారత్కు మంచి రోజులు వచ్చాయనుకున్నానని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు. భారత ప్రణాళికా సంఘం అంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండేవని, ఎందరో మహానుభావులు అందులో సభ్యులుగా ఉండేవారని, దేశానికి అవసరమైన కీలక నిర్ణయాలన్నీ తీసుకునేవారన్నారు. కొన్ని నియమ నిబంధనలతోపాటు రాష్ట్రాల బడ్జెట్లకు కూడా అవి మార్గదర్శకత్వం వహించేవన్నారు. ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ అనేది నిరర్ధక సంస్థలా మారిందని, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో, నీతి ఆయోగ్లో నీతి అంత ఉందని, కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు అయ్యిందన్నారు.

భజనపరుల బృందంలా మారిన నీతి ఆయోగ్
మేధోమధనానికి బొందపెట్టి, ప్రధానమంత్రి చెప్పే మాటలతో, లేదంటే మరొకరు చెప్పే మాటలకో భజన చేసే సంస్థలా మారిపోయిందని, బీజేపీ వాగ్దానాలు, మోదీ వాగ్దానాలు, నీతిఆయోగ్ సృష్టి దేశంలో ఒక జోక్గా మారిపోయిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలో శ్రీలంక పరిస్థితులు వచ్చేలా ఉన్నాయని, పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయన్నారు. దేశ చరిత్రలో రాజధానిలో 13 నెలలపాటు రైతులు ధర్నా చేశారని, వారిలో 700 నుంచి 800 మంది వరకు మరణించారని, ఆ తర్వాతే ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పి నల్లచట్టాలను వెనక్కి తీసుకున్నారన్నారు.

ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు
చేసిన వాగ్ధానం ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని, పరిస్థితి మెరుగైందా? మేధోసంపత్తి పెరిగిందా? అని ప్రశ్నించారు. డీజిల్, విత్తనాల రేట్లు అన్నీ పెరిగిపోయాయని, రైతుల ఆదాయం డబుల్ చేస్తామంటే.. వారి పెట్టుబడి రెట్టింపు అయింది కానీ రాబడి మాత్రం రెట్టింపు రాలేదన్నారు. మంచినీరు కూడా సరిగా దొరకడంలేదని, విద్యుత్తు ఉండదు.. తాగునీరు లేదు.. సాగునీరు లేదు.. నిరుద్యోగ సమస్య.. లక్షలాది పెట్టుబడులు విదేశలకు వెళుతున్నాయి.. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల మధ్య ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సమావేశానికి తాను వెళ్లడంలేదని కేసీఆర్ తెలిపారు.

కేంద్రానికి బహిరంగ లేఖ రాస్తాను
ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియజేయడానికి తాను హాజరుకాకపోవడమే ఉత్తమమైన మార్గంగా భావించానని, తన నిరసనను కేంద్రానికి లేఖ రూపంలో తెలియజేస్తాన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన రూ.14 లక్షల కోట్లను కొల్లగొట్టారని, ప్రగతి పథంలో దూసుకువెళుతున్న రాష్ట్రాల కాళ్లల్లో కట్టెలు పెట్టవద్దని కోరినప్పటికీ పెడచెవిన పెట్టారన్నారు. నిత్యావసరాల ధరలు అంతులేకుండా పెరుగుతున్నాయని, డాలర్ తో పోలిస్తే రూపాయి పాతాళానికి పడిపోయిందని, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే కేంద్రం పట్టించుకోలేదని కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications