స్నేహమంటే ఇదేరా.!టీడిపి నుండి వచ్చిన వారందరికి దాదాపు న్యాయం చేసిన కేసీఆర్.!
హైదరాబాద్ : రాజకీయాల్లో సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పెద్దపీఠ వేస్తారు. సమన్యాయం చేయందే ఆయనకు నిద్రపట్టదని చంద్రశేఖర్ రావును లోతుగా గమనించిన వాళ్లకు ఇట్టే అర్థమై పోతుంది. తనతో పాటు ప్రయాణం చేసిన రాజకీయ నాయకులకు ఎంతటి సాయం చేస్తారో, తన పాత స్నేహితులకు కూడా రాజకీయాల్లో అంతే న్యాయం చేస్తారని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన పాత స్నేహితులందరికి రాజకీయంగా పదవులు కట్టబెట్టడంలో చంద్రశేఖర్ రావు దాదాపు న్యాయం చేసారని తెలుస్తోంది.
పాత దోస్తులందకి సమన్యాయం..
స్నేహధర్మం పాటించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు మించిన నాయకుడు దేశంలో ఎక్కడా ఉండరని తెలుస్తోంది. పాత స్నేహితులను చేరదీయాలన్నా, చేరదీసిన తర్వాత వాళ్లను సక్కగ అరుసుకోవాలన్నా, అరుసుకోవడంతో పాటు రాజకీయ పదవులు కట్టబెట్టాలన్నా ఎలాంటి మొహమాటం లేకుండా సాహసోపేతంగా ముందడుగు వేస్తారు చంద్రశేఖర్ రావు. కరీంనగర్ నుండి యల్.రమణకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడంతో టీడిపి మిత్రబృందానికి చంద్రశేఖర్ రావు వందకు వెయ్యి శాతం సమన్యాయం చేసినట్టు రుజువయ్యిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది.
రాజకీయ దోస్తులు.. ఉద్యమ దోస్తులు..
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావులో ప్రధానంగా రెండు కోణాలు కనిపిస్తుంటాయి. రాజకీయ నాయకుడి కోణం మొదటిదైతే, ఉద్యమ నాయకుడి కోణం రెండోది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన తర్వాత రాజకీయ నాయకుడిని వదిలేసి ఉద్యమ నాయకుడిగా అవతరించారు చంద్రశేఖర్ రావు. ఉద్యమ నాయకుడిగా చంద్రశేఖర్ రావు అడుగులో అడుగు వేసేందకు చాలా మంది ముందుకు వచ్చారు. సర్వం త్యాగం చేసేందుకు సన్నద్దమవ్వడమే కాకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి చంద్రశేఖర్ రావు వెంట నడిచారు. తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న క్రమంలో చంద్రశేఖర్ రావును ఆయన పాత రాజకీయ మిత్రులు చాలా వరకు విమర్శించారు, దూషించారు, అసలు ఉద్యమం నుండి తప్పించే ప్రయత్నాలు కూడా చేసారు.
ఏమైనా జరగొచ్చు..
కాగా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు చంద్రశేఖర్ రావు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుసాద్యం చేసి తెలంగాణ ప్రజానికం మద్య హీరోగా నిలిచారు చంద్రశేఖర్ రావు. అయితే తెలంగాణ సాధన ప్రక్రియలో చంద్రశేఖర్ రావుతో సుధీర్గంగా ప్రయాణం చేసి ఆయనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఉద్యమ మిత్రులందరికి తెలంగాణ సిద్దించిన తర్వాత చంద్రశేఖర్ రావు రాజకీయాలు అవకాశాలు కల్పించారా అని అడిగితే మాత్రం ఆశించిన సమాధానం రావడంలేదు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదో సవంత్సరంలోకి అడుగుపెడుతున్నప్పటికి సరైన గుర్తిపు కోసం ఉద్యమకారులు ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.
పసుపు మిత్రులకు ప్రాధాన్యం..
ఐతే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు గానీ, శాశ్వత శత్రువులుగాని ఉండరని చంద్రశేఖర్ రావు రాజకీయ వ్యవహారాలను గమనిస్తే ఇట్టే అర్దమైపోతుంది. ఉద్యమ సమయంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరి, చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన మీద రాజకీయ విమర్శలు తారా స్ధాయిలో వినిపించాయి. ప్రతిరోజు చంద్రశేఖర్ రావుపై ఆరోపణలు, దూషణలు చేయని నాయకుడు ఉండేవాడు కాదు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, కడియం శ్రీహరి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, గుండు సుధారాణి, పట్నం మహేందర్ రెడ్డి వంటి నేతలకు చంద్రశేఖర్ రావు సముచిత స్ధానం కల్పించారు. ఇక ఇటీవల గులాబీ తీర్ధం పుచ్చుకున్న యల్ రమణకు కూడా ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి. నేడో రేపో మోత్కుపల్లి నర్సింహులు కు కూడా ఏదో ఒక పదవి ఇస్తారనే చర్చ జరుగుతోంది. దీంతో ఇతర పార్టీల విషయం పక్కన పెడితే తెలుగుదేశం నుండి వెళ్లిన ప్రతి నాయకుడికి చంద్రశేఖర్ రావు రాజకీయ పదవులు కట్టబెట్టారనే చర్చ జరుగుతోంది. అంతే కదా పాత దోస్తులా..!మజాకా..!