కార్యవర్గ సభ్యులకు ఉన్న గౌరవం వారికి లేదా?జాతీయ పార్టీ ప్రకటనకు మాజీ మంత్రులను దూరం పెట్టిన కేసీఆర్.!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 28రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవ్వరూ చేయని ధైర్యాన్ని చంద్రశేఖర్ రావు చేసారు. దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా, సమర్ధవంతమైన ప్రధానిగా ప్రశంసలు అందుకుంటున్న నరేంద్ర మోదీతో సై అంటే సై అనేందుకు రంగం సిద్దం చేసారు. మనుగడలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్రీయ సమితి అనే జాతీయ పార్టీగా మార్చుతూ తీర్మాణం చేసారు. ఈ తీర్మాణం చేసిన క్రమంలో చంద్రశేఖర్ రావు పైన అంతర్గతంగా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన .. ఆవేదన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రులు
తెలంగాణ భవన్ లో కార్యవర్గ సమావేశం నిర్వహించి సభ్యుల సమక్షంలో ఏకగ్రీవ తీర్మాణం చేసి, ఆ తీర్మాణాన్ని ఆమోదించినట్టు, టీఆర్ఎస్ పార్టీ ఇక బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందినట్టు ప్రకటించారు. అసలు చిక్కులు ఇక్కడే ఉత్పన్నమైనట్టు తెలుస్తోంది. రాజకీయ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే క్రమంలో పార్టీ సీనియర్ నేతలను, మాజీ మంత్రులను, ఇతర పోటిట్ బ్యూరో సభ్యులను ఆహ్వానించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఇది రాజకీయ పార్టీకు సంప్రదాయంగా వస్తున్న ఆచారం కూడా. కానీ జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో సీఎం చంద్రశేఖర్ రావు ఈ సంప్రదాయాన్ని తుంగలో తొక్కినట్టు తెలుస్తోంది.
జాతీయ పార్టీ ప్రకటన సరే.. సీనియర్లకు గుర్తింపేదంటున్న మాజీ మంత్రులు
పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న కొంతమంది మాజీ మంత్రులకు భారత్ రాష్ట్రీయ సమితి గురించి సరైన సమాచారం ఇవ్వలేదని, జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతున్న క్రమంలో జరిగే మంచి చెడుల గురించి అసలు చంద్రశేఖర్ రావు చర్చించలేదని కొంత మంది మాజీ మంత్రులలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. చంద్రశేఖర్ రావు చారిత్రక నిర్ణయం తీసుకున్న క్రమంలో సీనియర్ల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని ఉండి ఉంటే మరింతి హుందాగా ఉండేదనే భావన పార్టీ సీనియర్లతో పార్టీ మాజీ మంత్రుల్లో వ్యక్తమవుతోంది.
కార్యవర్గ సభ్యలకు ఉన్న గౌరవం మాజీ మంత్రులకు లేదా.. మదనపడుతున్న సీనియర్లు
ఇదే అంశంపైన మాజీ మంత్రుల మద్య, సీనియర్ల మద్య లోతైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కార్యవర్గ సభ్యులకు ఇచ్చిన గుర్తింపు మాజీ మంత్రులకు ఇవ్వలేకపోయారని వీరందరూ మదన పడుతున్నట్టు తెలుస్తోంది. కార్యవర్గ సమావేశానికి మాజీ మంత్రులను కూడా ఆహ్వానించి ఉండిఉంటే ఆమోదయోగ్యంగా ఉండేదనే అభిప్రాయాలను సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. కార్యవర్గ సమావేశంలో సభ్యుల నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికి మాజీ మంత్రులను ఆహ్వినించి ఉంటే కార్యక్రమానికి అదనపు గైరవం వచ్చేదని సీనియర్లు భావిస్తున్నారు.
విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న సీనియర్లు.. అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రులు
టీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు, సీనియర్లుగా ముద్ర వేసుకున్న తుమ్మల నాగేశ్వర రావు, మోత్కుపల్లి నర్సింహులు, పెద్ది రెడ్డి, మధుసూధనా చారి, మండవ వెంకటేశ్వర్ రావు వంటి మాజీ మంత్రులను తెలంగాణ భవన్ కు ఆహ్వానించకపోడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవంతో పాటు అనేక సందర్బాల్లో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉన్న తమను చంద్రశేఖర్ రావు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని వారు ఆందోళపపడుతున్నట్టు తెలుస్తోంది. చిన్న అంశాలను కూడా సూక్ష్మదృష్టితో లోతుగా పరిశీలించి, పార్టీలోని అందరి అభిప్రాయాలకు ప్రాముఖ్యతనిచ్చే చంద్రశేఖర్ రావు, జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో మాజీ మంత్రులను ఎందుకు విస్మరించారనే అంశంపై సీనియర్లలో లోతైన చర్చ జరుగుతున్నట్టు చర్చ జరుగుతోంది.