వినడానికే బాధనిపిస్తోంది.. అక్కడే చచ్చిపోతాడని నాపై దుష్ప్రచారం: కేసీఆర్ ఆవేదన
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం అసెంబ్లీలో ఎవరూ ఊహించని ఓ అంశాన్ని ప్రస్తావించారు. తన ఆరోగ్యంపై కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు.
అధ్యక్షా..: కిషన్ అసహనం, అరాచకమన్న కేసీఆర్; 'పెద్దలు జానారెడ్డి'పై ఇలా
కేసీఆర్ చెప్పినట్టుగానే గత కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యంపై జనాల్లో కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. అవి సీఎం దృష్టికి వచ్చినందునే ఆయన స్పందించినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ కక్షపూరితంగా..:
తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఐదు రోజులకే కాంగ్రెస్ నేతలు తన దిష్టిబొమ్మలను దహనం చేశారని గుర్తుచేశారు. ప్రధానిని కలవడానికి వెళ్తే తనపై దుష్ప్రచారం చేశారని అన్నారు.
ఆరోగ్యంపై దుష్ప్రచారం..:
ఇక తన ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్నట్టు చెప్పిన కేసీఆర్..'నాకేదో జబ్బు వచ్చినట్టు.. అందుకే అమెరికాకు పోతున్నట్టు.. కేసీఆర్ అక్కడే చచ్చిపోతాడన్నట్టు నాలుగు సంవత్సరాలుగా నాపై విష ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇన్నేళ్లా?.. వినడానికే బాధనిపిస్తోంది అధ్యక్షా' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓర్వలేకనే కేసీఆర్ ఇలా..:
నాలుగేళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శాంతిభద్రలకు ఢోకా లేదని, అది ఓర్వలేకనే కాంగ్రెస్ అరాచకాలు సృష్టిస్తోందని కేసీఆర్ విమర్శించారు. అరాచక శక్తుల పీచమణచడంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, వెనకడుగు వేయబోదని హెచ్చరించారు.
ఇది సిగ్గుచేటు: కేసీఆర్
హెడ్సెట్ తగిలి మండలి ఛైర్మన్ కన్నుకు గాయమైతే దాన్ని నాటకమని కాంగ్రెస్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు కేసీఆర్. బీఏసీ సమావేశంలో అన్నింటినీ ఒప్పుకుని తీరా సభకు వచ్చాక ఆందోళన చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. విపక్ష సభ్యులు కోరినట్టే.. ఎన్ని రోజులైనా సభ నిర్వహిస్తామని చెప్పినా.. తొలిరోజే ఆందోళనలకు దిగడమేంటని అసహనం వ్యక్తం చేశారు.