కెసిఆర్ది పక్కా వైఎస్ పంథానే: ప్రతిపక్షాల కాళ్ల కిందికి నీళ్లు
హైదరాబాద్: అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షాలకు లేని అవకాశాలుంటాయి. అధికారంలో ఉన్న పార్టీ వైపు అందరూ చూడడం పరిపాటి. అయితే, ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని బలం పెంచుకుంటూ, ప్రతిపక్షాలను దెబ్బ తీయడంలో అధి నాయకుడి రాజకీయ చతురత ఇమిడి ఉంటుంది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కాగా వైయస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన పంథానే అనుసరిస్తున్నారు.
ప్రతిపక్షాలను చావుదెబ్బ తీసే పనిని ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రారంభించారు. క్రమంగా కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను బలహీన పరిచే వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. నిజానికి, కెసిఆర్ది సుదీర్ఘ కాలం అమలు చేసే వ్యూహం. అదే సమయంలో నమ్మి వెంట ఉన్నవారికి తగిన స్థానం కల్పించడం కూడా ఆయన చేస్తున్న పని.
వైయస్ రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం, తెరాస గుండెల్లో గుబులు రేపారు. ఆ పార్టీల్లోని మాటకారులను, ప్రజల్లో బలం ఉన్న నాయకులను ఒక్కరొక్కరినే కాంగ్రెసులోకి లాగుతూ వచ్చారు. కాంగ్రెసు జాతీయ పార్టీయే అయినప్పటికీ దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి ప్రాంతీయ పార్టీగా మలిచారు. దానికి తానే అన్నీ అయి వ్యవహరిస్తూ వచ్చారు. అందుకు కాంగ్రెసు అధిష్టానం ఆయనకు పూర్తి సహకారం అందించింది.

కాంగ్రెసు పార్టీలో సీనియర్లను దెబ్బ తీస్తూ తనదైన బలమైన వర్గాన్ని ఆయన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీని, తెరాసను దెబ్బ మీద దెబ్బ తీస్తూ గుక్క తిప్పుకోకుండా చేశారు. అదే వ్యూహాన్ని తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ అనుసరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర రావు వంటి సీనియర్ నాయకులను, ఆ పార్టీ నుంచి గెలిచిన శాసనసభ్యులను పార్టీలోకి లాగుతూ వచ్చారు.
తనకు శాసనసభలో అధికారంలో కొనసాగడానికి తగిన బలం ఉన్నప్పటికీ ఇతర పార్టీల శాసనసభ్యులను వదిలిపెట్టలేదు. గ్రేటర్ హైదరాబాద్పై పట్టు కోసం ఆయన మిగతా అన్ని పనులూ చేస్తూనే దాని పరిధిలోని ఇతర పార్టీల శాసనసభ్యులను లాగుతూ వచ్చారు. దాంతో గ్రేటర్ హైదరాబాదు పరిధిలో తెరాస బలంగా తయారైంది.
ప్రజలకు నమ్మకం కలిగించే పనిని దానికి సమాంతరంగా చేస్తూ వచ్చారు. బహిరంగ సభలో వేదిక మీద మైకు పట్టుకుంటే ప్రజలను పడేసే మాటకారి తనం వైయస్ లాగే కెసిఆర్కు కూడా ఉంది. ప్రతిపక్షాలను మాటలతో తుత్తునియలు చేసే లక్షణం కూడా అంతే. అదే సమయంలో తనకు విశ్వాసంగా ఉంటూ వచ్చేవారికి సమయం చూసి తగిన స్థానం కల్పించడంలో కూడా ఇద్దరూ ఒక్కటే. కాకుంటే, తొందరపడి పార్టీ వీడేవారిదే పాపమన్నట్లుగా పరిస్తితిని తయారు చేస్తారు.
మొత్తం మీద, సుదీర్ఘ కాలం అధికారంలో ఉండడానికి వీలైన ఏర్పాట్లన్నీ కెసిఆర్ తెలంగాణలో చేసుకుంటున్నారు. సీనియర్లకు, జూనియర్లకు మధ్య సమన్వయ కుదిరించడంలో, స్థానికంగా నాయకుల మధ్య ఉండే విభేదాలను పరిష్కరించడంలో కెసిఆర్ చాలా చాతుర్యంతో పనిచేస్తున్నారనే మాట వినిపిస్తోంది. లేకుంటే, వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, కొండా సురేఖ, ఎర్రబెల్లి దయాకర్ రావును ఒకే గొడుగు కిందికి తేవడం సాధ్యమయ్యేది కాదు.












Click it and Unblock the Notifications