'తెలంగాణ కోసం కేసీఆర్ 15 ఏళ్లే పోరాడారు, విద్యార్థుల్ని మరిచారు'
హైదరాబాద్: తెలంగాణ కోసం కేసీఆర్ 15 ఏళ్ల ఉద్యమమే చేశారని, అంతకుముందు 60 ఏళ్ల నుంచి ఎందరో తెలంగాణవాదులు, విద్యార్థి పరిషత్ ఉద్యమాన్ని నడిపించాయని ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ అన్నారు.
శనివారం నిజామాబాద్ జిల్లాలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఉద్యమాలతో సీఎం గద్దెనెక్కి వారినే మరిచిపోయారన్నారు. పేదలకు ఇళ్లు కట్టించడాన్ని ఏబీవీపీ స్వాగతిస్తుందని కానీ, ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల్లో కట్టిస్తామంటే వ్యతిరేకిస్తామన్నారు.
విశ్వవిద్యాలయాలకు అంతర్జాతీయ హోదా తేవాలన్నారు. అంతేకానీ భూములను తీసుకోవడం సరికాదన్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు పెంచితే విద్యార్థులు విదేశాలకు వెళ్లకుండా ఆ ప్రతిభను స్వదేశం కోసం వినియోగిస్తారని చెప్పారు. వైద్య విద్య రుసుం పెంచడం విద్యార్థులకు శాపంగా మారిందన్నారు.
భ్రష్టు పట్టిస్తున్నారు: ఉత్తమ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని, రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు పెరిగిపోతున్నాయని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపరచిన విధంగా గిరిజనులకు మూడు ఎకరాల భూమిని నేటికి ఇవ్వలేదన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయిస్తున్నా ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు వేల కోట్లు కేటాయించడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు.
ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు నిజానిజాలను నిర్బయంగా బయటపెట్టి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు. ఇందులో దొరకని దొంగలను కూడా పట్టుకుని శిక్షించాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్-4 పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని, ఎవరిదైనా కొన్ని రోజులు మాత్రమే ఉంటుందన్నారు. అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, పార్టీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు.
ఇంటి దొంగల వల్ల కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం కోల్పోయిందని, 130 ఏళ్లుగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరించి దేశాన్ని అభివృద్ధి పరుచుకున్నారని అన్నారు. ఇప్పుడు పరిపాలిస్తున్న అధినేతలు దమ్ముంటే రాజీనామాలు చేసి ప్రజల్లోకి వచ్చి మళ్లీ గెలుపొందాలని ఉసవాల్ చేశారు.