పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే: సౌత్ ఇండియాలోనే కేసీఆర్ రికార్డ్ అంటూ కేటీఆర్
కామారెడ్డి: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. కామారెడ్డి డిగ్రీ కాలేజీ మైదానంలో మినీ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ఈ నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందని, పొత్తులో భాగంగా 2004లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామన్నారు.
పార్టీలోకి గంప గోవర్ధన్ రావడంతో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందననారు కేటీఆర్. గోవర్ధన్ విజ్ఞప్తి మేరకే కేసీఆర్ కామారెడ్డి నుంచి బరిలోకి దిగుతున్నారని కేటీఆర్ తెలిపారు. కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు ఖాయమని అన్నారు. ఇప్పటికే అభివృద్ధిలో కామారెడ్డి దూసుకుపోతోందన్నారు. రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థాయికి ఎదగాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ బరిలోకి దిగాలని గోవర్ధన్ విజ్ఞప్తి చేశారన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక బలమైన ఆశయం, దృఢ సంకల్పం ఉంటుందన్నారు కేటీఆర్.

కేసీఆర్పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలను కట్టినట్టేనని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ ప్రకటన రాగానే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయన్నారు. కామారెడ్డిలో కొడితే ప్రతిపక్షాల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలని అన్నారు. ఇక్కడ కేసీఆర్ గెలుపు ఖాయమైందని.. తేలాల్సింది మెజార్టీయేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికల్లో దక్షిణ భారతదేశంలోనే సీఎం కేసీఆర్ సరికొత్త రికార్డు సృష్టిస్తారని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ పథకాల కోసం మహారాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. నెర్రెలు బారిన నేలలో పచ్చని పంటలు పండించాలన్నదే కేసీఆర్ ధ్యేయమని తెలిపారు. సీఎం కేసీఆర్నుకామారెడ్డి ప్రజలు గుండెల నిండుగా ఆశీర్వదించాలని కోరారు. 8 మండలాల్లో స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామన్నారు. తెలంగాణ ఉద్యమానికి నిధుల సేకరణ కామారెడ్డిలోనే ప్రారంభమైందన్నారు.

బీజేపీది ఒట్టి మేకప్ అయితే.. కాంగ్రెస్ది ప్యాకప్. కాంగ్రెసోళ్లు ఓటుకు నోటు దొంగ చేతిలో పార్టీని పెట్టారు. ఓటుకు నోటు దొంగ ఓ దిక్కు.. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన దొంగ ఓ దిక్కు ఉన్నారు. వీళ్లిద్దరితో కేసీఆర్ కు పోటా. రాజీనామా చేయమంటే కిషన్ రెడ్డి అమెరికా పోయిండు. రేవంత్ రెడ్డి ఏకంగా గన్ తీసుకొని ఉద్యమ కారుల మీదికి పోయిండు. వీళ్లు మనకు పోటీనా? ఆనాడు ఓటుకు నోటు.. ఈనాడు సీటుకో రేటు.
కాంగ్రెస్లో ఇప్పటికే లొల్లి మొదలైంది. కాంగ్రెస్ లీడర్లు రేవంత్ రెడ్డిని.. రేట్ ఎంత రెడ్డి అంటున్నారు. అయినా రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలిచే 10, 12 మందితో బీజేపీలో చేరడం ఖాయం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు.. ఫంక్తు ఆర్ఎస్ఎస్ మనిషి. ఆయన మొదలు నుంచి ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా పనిచేశాడు. అందుకే ఆయనకు బీజేపీ వాళ్లతో చీకటి ఒప్పందం ఉందని కేటీఆర్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications