విలాసాలకేనా: కెసిఆర్పై రేవంత్ మళ్లీ, చంద్రబాబు 5 లక్షలిస్తే మనమివ్వలేమా
హైదరాబాద్: విలాసాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నం పెట్టే రైతులను ఆదుకోవడంలో మాత్రం విఫలమవుతోందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి బుధవారం మండిపడ్డారు.
ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు హైదరాబాద్లోని గన్పార్క్ వద్ద ఆందోళన చేపట్టారు. వీరికి తెలుగు మహిళలు పూర్తి మద్దతు ప్రకటించారు.
అప్పుల బాధలు తట్టుకోలేక తమ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం నుంచి తమకు ఇంత వరకు ఎలాంటి సహాయం అందలేదని బాధితులు వాపోయారు. తమ రుణాలు ఒకేసారి మాఫీ చేయడంతో పాటు, ఒక్కొక్కరికీ ఐదులక్షల చొప్పున పరిహారం అందించాలని బాధితులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తోందని, మనం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
కల్లు బాధితులను పరామార్శించిన మంత్రి పోచారం
నిజామాబాద్ జిల్లా కేంద్రం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
రసాయనాలతో కల్తీ కల్లు తయారు చేయడంవల్లనే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రజలను కల్తీ కల్లు లేని పరిస్థితికి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లు కల్తీ చేసి ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఎవరినీ వదలమని హెచ్చరించారు. బాధితులకు అన్ని విధాలా చికిత్స అందించాలని వైద్యాధికారులకు ఆదేశించారు.