కొలువుల జాతర: 23,494 పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్..
రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు లబ్ది చేకూరేవిధంగా కేజీ టూ పీజీ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తోన్న ప్రభుత్వం..
హైదరాబాద్: రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు లబ్ది చేకూరేవిధంగా కేజీ టూ పీజీ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తోన్న ప్రభుత్వం.. దీనికి అవసరమైన సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నాలుగు విభాగాల్లో చేపట్టబోయే మొత్తం 726రెసిడెన్షియల్ స్కూళ్లకు దశలవారిగా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం మొత్తం 23,494పోస్టులను దశలవారిగా భర్తీ చేయనున్నారు. ఇందులో 20,299 పోస్టులు బోధన, 3185 బోధనేతర సిబ్బందిగా నిర్ణయించారు.
ప్రతీ ఏటా ఉద్యోగుల నియామకానికి ఆమోదం:
ఇప్పటికే కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయని ఈ సందర్బంగా సీఎం తెలిపారు. దీనికి అనుగుణంగా స్కూళ్లలో తరగతులు పెరుగుతున్న కొద్దీ ఉద్యోగుల నియామక ప్రక్రియ జరపాలని చెప్పారు. ప్రతీ ఏటా ఆయా స్కూల్స్ తమ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకునేందుకు అనుమతినిచ్చారు.
టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు:
కాగా, ప్రస్తుత 2017-2018 సంవత్సరానికి 8245మంది ఉద్యోగులను తక్షణం భర్తీ చేయాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇవ్వాలని, టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని ఆదేశించారు.
ఎస్సీ విభాగంలో..
ఎస్సీ విద్యార్థుల కోసం కొత్తగా స్థాపించబోయే 104 రెసిడెన్షియల్ స్కూళ్లలో 3,090 మంది సిబ్బందిని నియమించనున్నారు. అలాగే డిగ్రీ విభాగంలో ఉన్న 30 రెసిడెన్షియల్ కాలేజీల్లో 1500 మందిని, ఇప్పటికే నిర్వహిస్తున్న 98 ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో అవసరమైన 3920 మందిని నియమిస్తారు.
వెలుగు ప్రాజెక్టు కింద పనిచేసే 36 ఎస్సీ స్కూళ్లలో 778 మంది ఉద్యోగులను నియమించడంతో పాటు కొత్తగా స్థాపించే 51 ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1554మందిని నియమించనున్నట్లు సీఎం వివరించారు.
రెసిడెన్షియల్ స్కూల్స్లో నియామకాలు:
ఇక ఇప్పటికే నడుస్తున్న 65 ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1939 మంది సిబ్బంది అవసరమని గుర్తించారు. దీంతో పాటు కొత్తగా స్థాపించే 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 3570 మంది, ఇప్పటికే నడుస్తున్న 23 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 745 మంది, కొత్తగా స్థాపించే 118 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 4337 మంది, ఇప్పటికే ప్రారంభమైన 82 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 2063 మంది ఉద్యోగులను నియమించాలని నిర్ణయించారు.
శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు.. భవనాలు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లకోసం శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను నియమించడంతోపాటు, శాశ్వత భవనాలు కూడా నిర్మించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాల్సిందిగా అధికారులకు సీఎం సూచించారు. రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్వహణ, భవన నిర్మాణాలు, ఉద్యోగుల జీత భత్యాలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.