ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీ పెట్టాలని..కేంద్ర ఎన్నికల సంఘంపైనా..ప్లీనరీలో కేసీఆర్ హాట్ కామెంట్స్
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ప్లీనరీలో మాట్లాడిన కేసీఆర్ 20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తనను ఎన్నుకున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘంపై విరుచుకుపడ్డారు. తెలంగాణా ఉద్యమ కాలం నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
అనుమానాలు ,అపోహలు, దుష్ప్రచారాల మధ్య టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది
ఆనాడు తెలంగాణ ఉద్యమంపై అపనమ్మకం, గమ్యం పై స్పష్టత లేని పరిస్థితి ఉండేవని అలాంటి అగమ్యగోచర స్థితిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకుందని నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంపై ఆనాడు ఉన్న అనుమానాలు ,అపోహలు, దుష్ప్రచారాల మధ్య టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరింది అని అధినేత సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనకు కొంతమంది మిత్రులతో ఉద్యమం ప్రారంభమైనదని చెప్పిన కెసిఆర్, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాన్ని, స్వాతంత్రోద్యమ పోరాటంతో పోల్చి చెప్పారు.
ప్రపంచ ఉద్యమాలకే కొత్త భాష్యాన్ని, బాటను చూపింది తెలంగాణా ఉద్యమం
నాడు స్వాతంత్రోద్యమం లోనూ ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా పోరాటం ఆగలేదని, పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టే అంతిమంగా విజయం సాధించిందని, తెలంగాణ పోరాటం కూడా అదే కోవకు చెందుతుంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నాడు సమైక్య పాలకులు ఎన్నో నిందలు వేశారని ఎన్నో ముప్పతిప్పలు పెట్టారని చివరకు రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అడ్డుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని, అయినప్పటికీ తెలంగాణ ప్రజలు అంతే పట్టుదలతో ముందుకు సాగి, అహింసాయుత మార్గంలో పోరాటం చేసి విజయం సాధించకున్నామని కెసిఆర్ గుర్తు చేశారు.
ప్రపంచ ఉద్యమాలకే కొత్త భాష్యాన్ని, బాటను నిర్దేశించగలిగామని పేర్కొన్నారు. కెసిఆర్ చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతమైన కీర్తి ఉంటుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
ఆంధ్రాలో పార్టీ పెట్టమని విజ్ఞప్తి చేస్తున్నారు
ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ప్రకటించిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడితే గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. గతంలో తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని, భూముల ధరలు అన్ని పడిపోతాయని దుష్ప్రచారం చేశారని, కానీ ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారని పేర్కొన్న కేసీఆర్ తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల ప్రజల నుండి డిమాండ్లు వినిపిస్తున్నాయి అంటూ పక్క రాష్ట్రాల దృష్టి తెలంగాణపై పడిందని వ్యాఖ్యానించారు.
రాజీలేని పోరాటంతో తెలంగాణా సాధన
ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని గతంలో ఉపాధికోసం పాలమూరు నుంచి ముంబై వలస వెళ్లే వారిని అయితే ఇప్పుడు పాలమూరుకు వస్తున్నారు అంటూ కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోయారని, కొందరు పథకాలకు ఇంత ఆదాయం ఎక్కడి నుండి వస్తుంది అని అడుగుతున్నారని పేర్కొన్న కెసిఆర్ సాహసం లేకుండా ఏ కార్యము సాధ్యం కాదని తేల్చి చెప్పారు.రాజీలేని పోరాటంతోనే తెలంగాణ సాధించుకుందాం అని చెప్పిన కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసుకుంటున్నామంటూ వివరించారు.
తెలంగాణా పథకాలను కేంద్రం కాపీ కొడుతుంది, ఏపీలోలా తెలంగాణలో కరెంట్ కోతలు లేవు
తెలంగాణ రాష్ట్ర పథకాలను ఇతర రాష్ట్రాలే కాకుండా కేంద్రం కూడా కాపీ కొడుతుందని ఆయన పేర్కొన్నారు. నేడు ఏపీలో కరెంటు కోతలు ఉంటే తెలంగాణలో 24 గంటల కరెంటు వస్తుందన్నారు. కెసిఆర్ కొన్ని రాజకీయ పార్టీలలో నిలబడమంటే నిలబడాలి కూర్చోమంటే కూర్చోవాలని కానీ టిఆర్ఎస్ పార్టీలో అలా కాదని పేర్కొన్న కెసిఆర్ టీఆర్ఎస్ కు అధిష్టానం లేదు బాసులు లేరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా పునాది గల పార్టీ ఒక కుటుంబం లాంటిదని గులాబీ బాస్ చెప్పుకొచ్చారు.
కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడిన కేసీఆర్ .. హద్దు దాటుతుందని ఆగ్రహం
ఇక కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డ కెసిఆర్ ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హైటెక్స్ లో జరిగిన టీఆర్ఎస్ ప్రజలలో మాట్లాడిన ఆయన ఎన్నికల సంఘం గౌరవ ప్రదంగా వ్యవహరించాలని ఒక పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ సీఎం గా చెప్తున్నానని వెల్లడించారు. హుజురాబాద్ ప్రజలు అదృష్టవంతులు అని చెప్పిన కెసిఆర్ ఈసి ఏం చేసినప్పటికీ నవంబర్ 4 తర్వాత దళిత బందు అమలు జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. నవంబర్ 4 వరకు మాత్రమే దళిత బంధును ఆపగలరని, హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిచి తీరుతాడని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
బలమైన శక్తిగా ఎదిగిన టీఆర్ఎస్ .. కేసీఆర్ వెల్లడి
టిఆర్ఎస్ ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగిందని పేర్కొన్న కేసీఆర్ 425 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు టిఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇక వచ్చే మార్చి నెల వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో దళిత బంధును అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.