పక్కా వైఎస్ ప్లాన్తోనే కెసిఆర్: ధర్నా చౌక్ తీరుపై ఇదీ పద్ధతి...
ప్రతిపక్షాల నిరసనను బలప్రయోగం ద్వారా లేదా కౌంటర్ కార్యాచరణ ద్వారా ఎదుర్కునే విషయంలో కెసిఆర్ పక్కాగా వైఎస్ వ్యూహాలనే అనుసరిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పక్కా వైయస్ రాజశేఖర రెడ్డి ప్లాన్నే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. తనను వ్యతిరేకించేవారిని తిప్పికొట్టడానికి కౌంటర్ తయారు చేసి రంగంలోకి దింపడం వైయస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన వ్యూహం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్కు వైయస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధి మంత్రంతో ఓ ఎదురు తిరుగుడు పద్ధతిని అనుసరించారు. ప్రతిపక్షాలను తిప్పికొట్టడానికి ప్రభుత్వం తరహాలో కాకుండా మరో రకంగా కౌంటర్ ఇవ్వడం ఆయన పద్ధతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెసిఆర్ అదే పద్ధతిని, వ్యూహాన్నీ అనుసరిస్తున్నారు.
ఖమ్మం మిర్చి యార్డు ఘటనను తీసుకున్నా, హైదరాబాదులోని ధర్నా చౌక్ వద్ద జరిగిన సమరాన్ని గమనించినా ఆ విషయం తేటతెల్లమవుతుంది. తన ప్రభుత్వ తీరును సమర్థించుకోవడానికి కెసిఆర్ ప్రణాళికకు అనుగుణంగా నమస్తే తెలంగాణ దినపత్రిక మంగళవారంనాడు ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఎర్రజెండాల గుండాగిరి అనే శీర్షిక పెట్టి ప్రతిపక్షాలను, తెలంగాణ జెఎసిని ఉతికి ఆరేసింది.
స్థానికులు ఇలా కోరుతున్నారంటూ...
ఇందిరాపార్కు వద్ద తమ కాలనీల సమీపంనుంచి ధర్నా చౌక్ను ఎత్తివేయాలని, తమ గోసను ప్రభుత్వం పట్టించుకోవాలని చాలా ఏళ్లుగా కోరుతు వస్తున్న స్థానికులు సోమవారం శాంతియుత ఆందోళనకు దిగారని, వీళ్లకు పోటీగా ఆక్యుపై ధర్నాచౌక్ పేరుతో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర ఎర్రజెండాల పార్టీలు, జేఏసీ ప్రోత్సాహం ఉన్న కొన్ని సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయని నమస్తే తెలంగాణ రాసింది. వామపక్షాలకు కాంగ్రెస్, టీడీపీ, కొత్తగా పుట్టుకొచ్చిన జనసేనతోపాటు కోదండరాం నేతృత్వంలోని జేఏసీ కూడా తోడై ఇందిరాపార్కులో వాకింగ్ చేసే వాకర్లు, పార్కు చుట్టుపక్కల ఉండే కాలనీల ప్రజలు సోమవారం ఉదయమే ధర్నాచౌక్ వద్దకు చేరుకోగా, అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎర్రజెండాల పార్టీల గూండాలు బెదిరించారని రాసింది.
గుండాలంటూ పదే పదే..
తాము ఇక్కడి నుంచి ధర్నాచౌక్ను తరలించాలని కోరుతున్నామని అక్కడ ఆందోళన చేయడానికి వచ్చిన కాంగ్రెస్, ఎర్రజెండా పార్టీలు, జేఏసీ నేతలకు స్థానికులు స్పష్టం చేశారని, స్థానికులు, వాకర్ల మాటలు ఎర్రజెండాలు పట్టుకొని వచ్చిన గూండాలు వినిపించుకోలేదని, వారిపై దాడులకు తెగబడ్డారని రాసింది. గుండాలు అనే పదం వాడుతూ వారు చేశారని చెబుతున్న అరచాకాలను నమస్తే తెలంగాణ ఏకరవు పెట్టింది.
ఇలా చేశారట..
వాకర్లపై ఎర్రజెండా గుండాలు పిడిగుద్దులు కురిపించారని అంటూ "గణేశ్ అనే స్థానికుడి తల పగులగొట్టారు. ధర్నా చౌక్ను ఎత్తివేయాలంటూ స్థానికులు కట్టుకున్న బ్యానర్లను చింపేశారు. కుర్చీలను కసితీరా విసిరి, విరిచిపారేశారు. కట్టెలతో వెంటపడి కొట్టే ప్రయత్నం చేశారు. దీనికి స్థానికులు హడలెత్తారు. ధర్నా చౌక్ను ఆక్రమించుకుంటామంటూ వచ్చినవారు తమ ప్రాణాలను తీసేలా ఉన్నారంటూ అక్కడ బందోబస్తుకు వచ్చిన పోలీసు అధికారుల శరణుజొచ్చారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశారు. ఇదే అదనుగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు పోలీసులపైనా దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది" అని నమస్తే తెలంగాణ చాలా "నిష్పాక్షికంగా" వార్తాకథనాన్ని రాసింది.
ఈ విషయంలో అదే మాట
ఇందిరా పార్కు సమీపంలోని ధర్నా చౌక్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొందనే విషయాన్ని మాత్రం నమస్తే తెలంగాణ అంగీకరించింది. ఆ యుద్ధవాతావరణం నెలకొనడానికి సిపిఐ, సిపిఎం కార్యకర్తలే కారణమంటూ నమస్తే తెలంగాణ వివరణాత్మకంగా రాసింది. స్థానికులకు మద్దతుగా నిలిచిన కార్పోరేటర్లంటూ లాస్య నందిత, హేమలత, ముఠా పద్మ పేర్లు రాసింది.
కోదండరామ్ రాకతోనే..
నమస్తే తెలంగా కథనం ఇలా సాగింది - ఉదయం 11.05 గంటల సమయంలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సహా ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నేతలు బస్భవన్ నుంచి, జనసేన పార్టీ కార్యకర్తలు ట్యాంక్బండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా బయలుదేరి ధర్నాచౌక్కు చేరుకున్నారు. వీరిరాకతో అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. 11.20 గంటల ప్రాంతంలో వీరంతా బారికేడ్లను తోసుకుని ధర్నాచౌక్లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించిన పోలీసులు చివరకు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. లెఫ్ట్ పార్టీ నేతలు దాడికి దిగే అవకాశముండటంతో ధర్నా చేస్తున్న వాకర్స్ అసోసియేషన్, బస్తీవాసులను అక్కడి నుంచి పంపించివేశారు. అప్పటికే ఉద్రేకంతో ఊగిపోతున్న విపక్ష ఆందోళనకారులు ఒక్కసారిగా బారికేడ్లను తొలగించుకుని, ధర్నాచౌక్లోకి చొచ్చుకెళ్లారు. పరిస్థితి పూర్తిగా చేజారిపోవడంతో పోలీసులు అడ్డుకోవడానికి స్వస్తిచెప్పి.. పక్కకు వైదొలగడంతో లెఫ్ట్పార్టీల నేతలు, జేఏసీ, జనసేన నాయకులు ధర్నాచౌక్లోని పరుగులుపెట్టారు. టెంట్ల క్రింద ఉన్న వందల కుర్చీలను ధ్వంసం చేశారు. ధర్నాచౌక్ ప్రాంగణంలోనే వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏర్పాటు చేసుకున్న టెంట్ల కిందే సభ పెట్టుకుని ప్రసంగాలు చేశారు. ఉదయం 11.40 గంటల ప్రాంతంలో టీటీడీపీ నేతలు రేవంత్రెడ్డి, ఎల్ రమణ, పెద్దిరెడ్డి,మరో పదినిమిషాలకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి ధర్నాచౌక్కు చేరుకున్నారు. 12.30 గంటల వరకు నేతల ప్రసంగాలు కొనసాగాయి. మధ్యాహ్నం 1.15 గంటల తర్వాత ఎక్కడివారక్కడికి వెళ్లిపోవడంతో ధర్నాచౌక్లో మళ్లీ ప్రశాంత వాతావరణం నెలకొంది.
మఫ్టీలో పోలీసులుంటే తప్పా?
మప్టీలో పోలీసులు ఉండడాన్ని నమస్తే తెలంగాణ బాగానే సమర్థించుకుంది. "ఇందిరాపార్కు వద్ద మఫ్టీలో పోలీసులు ఉండడం కొత్తేమీ కాదు. ఎక్కడైనా ఆందోళనలు జరుగుతున్నపుడు యూనిఫాంతో ఉండేవారితోపాటు మఫ్టీ పోలీసులు కూడా ఉంటారు. పోలీసులు మఫ్టీలో ఉన్నారంటూ కొందరు నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని బస్తీవాసులు చెప్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నామని, రక్షణ కోసం పోలీసులు వచ్చారని, అయినప్పటికీ తమపై దాడులు జరిగాయని చెప్పారు. లెఫ్ట్ పార్టీల తీరును తాము ఎండగడ్తామన్నారు" అని రాసింది.
పథకం ప్రకారం చేశారంటూ..
నమస్తే తెలంగాణ ఇంకా ఈ విధంగా రాసింది "ధర్నాచౌక్ను ఎత్తివేయొద్దంటూ వామపక్ష పార్టీలు పెద్ద పెద్ద కర్రలు, అల్యూమినియం రాడ్లతో కూడిన జెండాలను పట్టుకొని ఘటన స్థలానికి రావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పథకం ప్రకారమే వాటిని చేతబూని వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆందోళన సద్దుమణిగాక ఘటనాస్థలంలో విపక్ష ఆందోళనకారులు వదిలేసి వెళ్లిన పలు అల్యూమినియం రాడ్లు, కర్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆందోళనకు సంబంధించిన వీడియోలు, సీసీ కెమెరాల ఫుటేజ్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆందోళనలో పలు టెంట్లు, వెయ్యి వరకూ కుర్చీలు ధ్వంసమయ్యాయి. 13 మంది వరకు గాయపడ్డారు. ఇందులో ముగ్గురు స్థానికులు, ముగ్గురు పోలీసులు, ఏడుగురు వామపక్ష పార్టీల కార్యకర్తలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు" అని రాసింది.
ఇటువంటి కౌంటర్లతో గట్టెక్కేనా....
పోలీసులను ప్రయోగించడం ద్వారా, రైతులపై కేసులు పెట్టి వారికి బేడీలు వేయడం ద్వారా, ప్రతిపక్షాల కుట్ర అంటూ నమస్తే తెలంగాణలో రాయించడం ద్వారా తన ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న నిరనసనలకు ముఖ్యమంత్రి కెసిఆర్ అడ్డుకట్ట వేయగలరా అనేది ప్రశ్న. తనకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి సాహసించకుండా ప్రజలను లేదా ప్రతిపక్షాల కార్యకర్తలను ఆయన భయపెట్టగలరేమో గానీ లోలోన రగులుతున్న అసంతృప్తి జ్వాలలను ఆర్పివేయలరనేది నిజం. వచ్చే ఎన్నికల నాటికి గూడుకట్టుకుని, పేరుకుపోతున్న అసంతృప్తి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అగ్నిపరీక్ష పెట్టే ప్రమాదం లేకపోలేదు.
ప్రజలను నమ్మించడానికి బదులు...
ప్రజలను నమ్మించి తన వైపు తిప్పుకోవడానికి బదులు పెల్లుబుకుతున్న నిరసనను బలవంతంగానో, ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోయడం ద్వారానో కెసిఆర్ అరికట్టలేరనేది నిజం. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన అనుసరించిన పద్ధతి ఏమైందనేది ఇప్పుడు ప్రశ్నగా మిగులుతోంది. కౌంటర్ కార్యాచరణ ద్వారా వైయస్ రాజశేఖర రెడ్డి తనపై వ్యతిరేకతను, తెలంగాణ విషయంలో వ్యతిరేకతను కూడా ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. అదే పద్ధతిని కెసిఆర్ ప్రస్తుతం అనుసరిస్తున్న కనిపిస్తున్నారు.