రాముడిపై దయచూపని కేసీఆర్..! సీఎం దర్శనంకోసం ఎదురుచూస్తున్న భద్రాద్రి రాముడు..!!
హైదరాబాద్ : భక్తి భావం మెండుగా ఉన్న తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తెలంగాణలో ప్రసిద్ది చెందిన ఆ పుణ్యక్షేత్రం వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. ప్రతియేటా జరిగే వివాహమహోత్సవానికి కూడా వస్త్రాభరణాలను ఇతరులతో పింపిస్తుండటం గమనార్హం. అంతే కాకుండా దేవాలయ అభివృద్దికి నిధులను కూడా అరొరగా కేటాయిస్తూ అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. పక్క రాష్ట్రంతో పాటు కేరళ, తమిళనాడులోని అనేక దేవాలయాలను దర్శించుకుంటున్న చంద్రశేఖర్ రావు తెలంగాణాకే తలమాణికమైన ఆ ప్రసిద్ద దేవాలయానికి వెళ్లకపోవడానికి ప్రత్యేక కారణాలేమైనా ఉన్నాయా..? తాను వెళ్లక పోయినా నిధుల కేటాయింపులో కూడా ఎందుకు చొరవ చూపడంలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాములోరికి దూరంగా చంద్రుడు..! అయోమయంలో భక్తులు..!!
భద్రాచలం రామాలయంపై టీఆర్ఎస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆలయ అభివృద్ధిపై తీవ్రమైన కసరత్తులు జరుగుతున్నాయి. కానీ కార్యరూపం దాల్చడంలేదు. భద్రాద్రి ఆలయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఒక్క నయాపైసా కూడా విడుదల చేయలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం కిరణ్కుమార్ రెడ్డి హయాంలో 9.50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వాటితో మాడవీధుల విస్తరణ, కల్యాణ మండపం అభివృద్ధి వంటి పనులు చేశారు.
గత ప్రభుత్వాలే బెట్టర్..! ఉమ్మడి రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా నిధులు..!!
మాడవీధుల విస్తరణ సమయంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో తలెత్తిన కోర్టు కేసుల వివాదంతో ఆ పనులను ఇప్పటి వరకూ కూడా పూర్తి చేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తూ మొక్కులు తీర్చుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు భద్రాద్రి శ్రీరాముడి వైపు కన్నెత్తి చూడకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో కీలక ఆలయాలకు పాలకమండళ్లను నియమించిన రాష్ట్రప్రభుత్వం భద్రాద్రి రామాలయానికి, పాలక మండలిని ఏర్పాటు చేయలేదు.
భద్రాద్రికి 100 కోట్లు కేటాయిస్తానన్న సీఎం..! ఇంతవరకూ రూపాయి ఇవ్వని కేసీఆర్..!!
ఆలయాభివృద్ధికి వందల కోట్లు మంజూరు చేస్తున్నందున ట్రస్టు బోర్డు స్థానంలో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ అది కూడా ఆచరణకు నోచుకులేదు. ట్రస్టు బోర్డు ఉంటే ఆలయాభివృద్ధికి నిధుల సమీకరణపై దృష్టిసారించే అవకాశం ఉండేది. ఆలయ పునర్ నిర్మాణ పనులకు 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని, ఎంత ఖర్చు చేసైనా సుందర భద్రాద్రిగా తీర్చిదిద్దుతామని పాలకులు ప్రకటించి రెండేళ్లు దాటింది. కానీ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ దుర్గమ్మ వారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా తరలి వెళ్లి మొక్కులు సమర్పించటం చర్చకు దారితీసింది.
ఇతర రాష్ట్రాల్లో చెల్లించుకుంటున్న మొక్కులు..! తెలంగాణలో ఎందుకు ట్రిక్కులంటున్న ప్రజలు..!!
ఆధ్యాత్మిక చింతన గల సీఎం చంద్రశేఖర్ రావు భద్రాచలం రాములోరి విషయంలో ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు సామాజిక మాధ్యమాల ద్వారా తమ గళాన్ని ఎక్కుపెడుతున్నారు. ఏడాదికి అన్ని రకాలుగా సుమారు 35 కోట్ల రూపాయల మేర ఆలయానికి ఆదాయం వస్తోంది. గతంలో ఏడాదికి 30 కోట్ల రూపాయలు లోపే ఆదాయం ఉండేది. కానీ ఇటీవల కాలంలో హుండీల ఆదాయం పెరిగింది. వచ్చిన ఆదాయంలో సింహభాగం వైదిక, సిబ్బంది జీతభత్యాలకే సరిపోతోంది. ప్రతీ ఏటా జరిగే శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల నిర్వహణ ఆలయానికి అదనపు భారమే అవుతోంది. స్వరాష్ట్రంలో కూడా భద్రాద్రి ఆలయాభివృద్ధికి ఇప్పటి వరకూ ఎటువంటి నిధులు విడుదల చేయకపోవటంపై ఈ ప్రాంత వాసుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.