కాంగ్రెస్, టీడీపీ కలిసిపోతాయని తేలిపోయింది, మోడీ చెప్పింది నిజం: కేటీఆర్
నిజామాబాద్: కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు కలిసిపోతాయని అవిశ్వాసం సమయంలోనే తెలిసిపోయిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం అన్నారు. ఆంధ్రా ప్రజలను వేరు చేసి చూడాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
భాగ్యనగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని చెప్పారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ హబ్కు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఒకేసారి రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తామని చెబుతున్నారని, మరి కర్ణాటకలో నాలుగు దశల్లో ఎందుకు మాఫీ చేస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎవరినైనా జైలుకు పంపాల్సింది కోర్టులు కానీ, తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం కాదన్నారు.

కాంగ్రెస్ పార్టీది బెయిల్ గాడీ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని, అది వాస్తవమని విమర్శించారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సహా చాలామంది కాంగ్రెస్ నేతలు బెయిల్ పైన ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో నివసించే వాళ్లంతా తెలంగాణ వాళ్లే అన్నారు.
నిజామాబాద్లో ఆధునిక బస్ టెర్మినల్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు. జక్రాన్పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ నీతిమాలిన వాగ్ధానాలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగేళ్లలోనే ఐటీ ఎగుమతులు రూ.లక్ష కోట్లకు చేరుకున్నాయన్నారు.
2013-14లో తెలంగాణలో ఐటీ ఎగుమతులు రూ. 56వేల కోట్లు మాత్రమే అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ ఎగుమతులను రూ.లక్షా 20 వేల కోట్లకు తీసుకుపోవాలని లక్ష్యం పెట్టుకున్నామని, ఈ సంవత్సరం వరకు రూ.లక్ష కోట్లకు చేరుకున్నామని చెప్పారు. రాబోయే సంవత్సరం తమ లక్ష్యం నెరవేరుతుందన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల ఉద్యోగాలు సృష్టించామన్నారు.
ఐటీని రాష్ట్ర రాజధానికి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నామని, ద్వితీయ శ్రేణి పట్టణాలతో పాటు మారుమూల గ్రామాలకు ఐటీని విస్తరించాలనే కేసీఆర్ సంకల్పంతో ముందుకెళ్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లోని యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే ఐటీ కంపెనీలను జిల్లాలకు విస్తరిస్తున్నామన్నారు.
గజ్వెల్లో కేసీఆర్ హరితహారం
ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్లో నాలుగో విడత హరితహారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్షా 116 మొక్కలు నాటాలని ఆయన పిలుపునివ్వగా, లెక్కకు మించి లక్షా 36వేల 588 మొక్కలు నాటారు. కార్యక్రమంలో 1778 మంది ఉద్యోగాలు, 13వేల మంది కూలీలు పాల్గొన్నారు. గజ్వెల్ మున్సిపాలిటీ పరిధిలో 12వేల ఇళ్ల నుంచి హరితహారంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications