ఈసారి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ జగన్ కేనా ? తెలంగాణ ఎన్నికల నేపథ్యం- ఏపీ ఎన్నికలపైనా ఎఫెక్ట్!
వచ్చే ఏడాది తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ అజెండా ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతోంది. ఏపీతో ప్రతీ విషయంలోనూ తెలంగాణను పోలుస్తూ ఎన్నికల తీరం దాటేందుకు కేసీఆర్ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఏపీ నుంచి గట్టిగా కౌంటర్లు పడుతున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మొదలైన ఈ వార్ మరింత ముదిరితే ఏపీ ఎన్నికలపైనా ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది.
కేసీఆర్ వర్సెస్ జగన్
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో టీడీపీకి వ్యతిరేకంగా జగన్ కు మద్దతివ్వడం మొదలుపెట్టిన కేసీఆర్.. ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని కొనసాగించారు. అప్పట్లో సీఎంలు కేసీఆర్, జగన్ ఇద్దరూ పలుమార్లు భేటీలు కావడం, ఇరు రాష్ట్రాలకు సంబంధించి మూడో వ్యక్తితో సంబంధం లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించుకుంటామని ప్రకటనలు చేయడం చూశాం.
ఆ తర్వాత రాయలసీమ లిఫ్ట్ దగ్గర మొదలైన వివాదం వీరిద్దరి మధ్య దూరం అమాంతం పెంచేసింది. దీని ప్రభావం ఈ ఏడాదిలో అంతగా కనిపించకపోయినా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మళ్లీతెరపైకి వస్తోంది.
ఏపీ-తెలంగాణ పోలిక తెస్తున్న టీఆర్ఎస్
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్న తెలంగాణ మంత్రులు ఏపీతో పలు విషయాల్లో రాష్ట్రాన్ని పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో ఉచిత విద్యుత్ మోటర్లకు మీటర్ల వ్యవహారం, టీచర్లతో వైసీపీ సర్కార్ వివాదాలు వంటి సున్నిత అంశాల్ని తెరపైకి తెస్తున్నారు.
కేసీఆర్ కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు, మరో సన్నిహితుడు ప్రశాంత్ రెడ్డి వంటి వారు ఈ వ్యాఖ్యలు చేస్తుండటంతో ఇది టీఆర్ఎస్ బాస్ పనేనన్న ప్రచారం జరుగుతోంది. దీనికి ఏపీ మంత్రులు,సలహాదారులు కౌంటర్లు వేస్తున్నారు.
జగన్ కు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్?
గతంలో 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ పలుమార్లు ప్రకటించి అనుకున్నట్లుగానే ఆయన్ను గద్దెదింపడంలో సక్సెస్ అయిన కేసీఆర్.. ఈసారి వైసీపీ అధినేత, సీఎం జగన్ కు ఆ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టుల విషయంలో ఏపీతో నెలకొన్న విభేదాలు, పోలవరం ముంపు, విభజన వివాదాల్ని కేంద్రంగా చేసుకుని ఏపీ సర్కార్ ను కేసీఆర్ టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు వైసీపీ సర్కార్ ఏపీలో ఉద్యోగులు, ఇతర వర్గాలతో వ్యవహరిస్తున్న తీరును కూడా తెలంగాణలో అదే వర్గాలకు గుర్తుచేస్తూ కేసీఆర్ రాజకీయాన్ని రగిల్చే పనిలోఉన్నారు. మరోవైపు జగన్ సోదరి షర్మిల బీజేపీకి మద్దతుగాఉంటూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఒకేసారి జగన్, షర్మిలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు.
టీఎస్ ఎన్నికలు-ఏపీ ఎన్నికలు
తెలంగాణలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కేసీఆర్ జగన్ పాలనను అస్త్రంగా మార్చుకుంటున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ వార్ మరింత ముదరడం ఖాయం.అప్పుడు జగన్ సర్కార్ కేసీఆర్ ను టార్గెట్ చేయడం మొదలుపెడితే ఈ వార్ ఉగ్రరూపం దాల్చడం ఖాయం.
అప్పుడు దాని ప్రభావం ఆ తర్వాత ఏడాది అంటే 2024లో జరిగే ఎన్నికల్లో కేసీఆర్ కూడా అదే స్దాయిలో రెచ్చిపోవడం ఖాయం. అయితే ఇందులో ఓ మినహాయింపు ఉంది. అది తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ గెలుపు సాధించడం. అది జరిగితే వార్ ఒకలా ఉంటుంది, లేకపోతే అది మరోలా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.