కేసీఆర్పై టీడీపీ, 'గొర్రెలతో ఎన్టీఆర్ భవన్ ముట్టడి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నేతలకు శిక్షణ తరగతుల కంటే ముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మానసిక వైద్య పరీక్షలు చేయించి పరిపాలన సంబంధ అంశాలపై శిక్షణ ఇప్పించాలని టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి శనివారం అన్నారు. రాజ్యాంగబద్దంగా పాలించవలసిన కేసీఆర్ రాచరిక పోకడల ద్వారా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు వ్యాఖ్యల దుమారం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు యాదవులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ హైదరాబాద్ నగర యావద సంఘం నాయకులు చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
పంజాగుట్ట కూడలిలో బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చంద్రబాబు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోపిడీకి గురి చేసిన చంద్రబాబు నేడు అహంకారపూరితంగా యాదవులను కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు.
లక్ష గొర్రెలతో ఎన్టీఆర్ భవన్ ముట్టడి: ఆంజనేయ గౌడ్
ఎన్నికల ముందు పాదయాత్ర, సభల్లో గొంగడి కప్పుకొని, గొర్రెపిల్లను ఎత్తుకొని మీడియాకు పోజులు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు యాదవ కులవృత్తిని అవమానపర్చడం విడ్డూరమని తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ విమర్శించారు. యాదవులకు క్షమాపణ చెప్పకుంటే లక్ష గొర్రెలు, మేకలతో ఎన్టీఆర్ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.