కేసీఆర్ పేరు వెయ్యేండ్లు నిలిచిపోతుంది.!ఏదుల రిజర్వాయర్ ను సీఎం ప్రారంభిస్తారన్న మంత్రి సింగిరెడ్డి.!
హైదరాబాద్ : కర్నెతండా ఎత్తిపోతల చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేసారు. గిరిజనుల ఆవాసాలు ఎక్కడైనా ఎత్తైన ప్రాంతాలలో ఉంటాయని, అలాంటి తండాలకు కూడా 76.19 కోట్ల రూపాయలతో సాగు నీరు అందించబోతున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా దానికి శంకుస్థాపన జరగబోతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జూరాల ప్రాజెక్టుతో సమానమైన ఏడు టీఎంసీల సామర్ధ్యంగల ఏదుల రిజర్వాయర్ ను కేవలం 22 నెలలలో నిర్మించామని, పార్టీలకు అతీతంగా ఏదుల నిర్మాణానికి అనేకమంది నేతలు సహకరించారని అన్నారు. భూసేకరణకు సహకరించిన రైతులకు ఎన్ని సార్లు దండం పెట్టినా తప్పులేదని, ఇంకో వెయ్యేళ్లయినా దానిని నిర్మించిన వారిగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేరు, మీ ప్రతినిధిగా ఇక్కడ నా పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని మంత్రి తెలిపారు.
కర్నెతండా ఎత్తిపోతల పథకం, వైద్య కళాశాల, వేరుశెనగ పరిశోధన కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్ , నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు శంకుస్థాపన, కలెక్టరేట్ కార్యాలయం, డబల్ బెడ్రూం ఇండ్లు, చిట్యాలలో నూతన మార్కెట్ యార్డుల ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా జరగనున్నదని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పర్యటన విజయవంతానికి ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు కృషిచేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పర్యటన సంధర్భంగా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీభాయి, అదనపు కలెక్టర్లు అశిష్ సంగ్వాన్, వేణుగోపాల్ హాజరయ్యారు.