చండీయాగానికి అంకురార్పణ: హోమం చేసిన సిఎం కెసిఆర్ దంపతులు
మెదక్: ముఖ్యమంత్రి సంకల్పించిన ఆయుత చండీయాగానికి శుక్రవారం జగదేవ్పూర్ మండలం ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్లో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంకురార్పణ చేశారు. డిసెంబర్ 23 నుండి 27 వరకు శైవ సంప్రదాయంలో జరిగే ఈ యాగానికి అంకురార్పణగా సిఎం కెసిఆర్ దంపతులతో అర్చకులు హోమం నిర్వహింపజేశారు.
చండీయాగం అంకురార్పణ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు త్రిపుర శర్మ, గోపాలకృష్ణశర్మ, మహేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10.30గంటలకు ప్రారంభమైన ఈ యాగం నాలుగు గంటల వరకు కొనసాగింది. యాగం అనంతరం కేసిఆర్ హైదరాబాద్కు తిరిగి వెళ్ళారు.
నాలుగు రోజులపాటు నిర్వహించే చండీయాగానికి ముందు 11 యాగాలు చేయనున్న దృష్ట్యా మొదటగా నవయాగాన్ని ప్రారంభించారు. మరో పది యాగాలు పూర్తి చేసిన అనంతరం డిసెంబర్ 23 నుండి ఆయుత చండీయాగం మొదలవుతుంది.
ఈ యాగానికి పలువురు పీఠాధిపతులు, ఐదువేల వేద బ్రాహ్మణులతోపాటు దేశ ప్రధాని, రాష్టప్రతి, ఇతర రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, పలువురు ముఖ్యమంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. దీనికోసం 30ఎకరాలలో ఏర్పాట్లు చేశారు. ఈ యాగం నిర్వహణ బాధ్యతలను నిజామాబాద్ బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి తీసుకున్నారు.