కెసిఆర్ దూకుడు: అక్టోబర్లో ఫెడరల్ ఫ్రంట్ సభ, సిపిఎం నేతలతో భేటీ
హైదరాబాద్: జాతీయ రాజకీయాలపై టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ ఫ్రంట్ ప్రయత్నాలను మరింత వేగం చేస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ ఏడాడి అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని తలపెట్టారు.
దేశంలో గుణాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ భావిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా పార్టీలను కూడగట్టేందుకు టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ తలపెట్టారు.
ఈ మేరకు ఇటీవలనే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీని కలిశారు. త్వరలోనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను కలవనున్నారు.కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలను ఒకే గూటికి తెచ్చే ప్రయత్నాలను కెసిఆర్ చేస్తున్నారు.

సభ ఫెడరల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో సభ
ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో ఫెడరల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో హైద్రాబాద్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ భావిస్తున్నారు. ఈ సభ నిర్వహించే నాటికి కాంగ్రెస్, బిజెపియేతర పార్టీల మద్దతును మరింత కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కెసిఆర్ భావిస్తున్నారు. ఈ సభలో ఫ్రంట్ విధివిధానాలను ప్రకటించే అవకాశం లేకపోలేదని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

సిపిఎం నేతలతో కెసిఆర్ భేటీ
సిపిఎం నేతలతో తెలంగాణ సీఎం కెసిఆర్ శనివారం నాడు భేటీ అయ్యారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంలు శనివారం నాడు తెలంగాణ సీఎం కెసిఆర్తో సమావేశమయ్యారు. కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ తరుణంలో కెసిఆర్ జాతీయ రాజకీయాలపై చర్చించారు. సిపీఎం జాతీయ మహసభలు ఏప్రిల్ 18వ తేది నుండి హైద్రాబాద్లో జరగనున్నాయి. ఈ మహసభలకు సహకరించాలని కెసిఆర్ను సిపిఎం నేతలు కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో టిఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరిగిన సీపిఎం నేతలు కెసిఆర్తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది. జాతీయ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సిపిఎం నేతలతో కెసిఆర్ సమావేశమయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కొంపల్లిలో టిఆర్ఎస్ ప్లీనరీ
టిఆర్ఎస్ ప్లీనరీని ఏప్రిల్ 27న, నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. టిఆర్ఎస్ ప్లీనరీలో భవిష్యత్తు కార్యాచరణను కూడ ప్లీనరీలో ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. ప్రతి నియోజకవర్గం నుండి 150 మంది ప్రతినిధులను ప్లీనరీకి ఆహ్వనిస్తున్నట్టుగా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై పలు తీర్మానాలు, చర్చలు ఈ ప్లీనరీలో ఉంటాయని ఆయన చెప్పారు.

ఎన్నికలపై దశ దిశా చేయనున్న ప్లీనరీ
2019 ఎన్నికలకు ఈ ప్లీనరీ దశ దిశను నిర్ధేశం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలో ఎన్నికల్లో పార్టీ శ్రేణులకు పార్టీ చీఫ్ కెసిఆర్ దశ దిశను నిర్ధేశం చేయనున్నారు.












Click it and Unblock the Notifications