నన్ను గొర్రెను గుంజుకొచ్చినట్లు...: కేసీఆర్ (పిక్చర్స్)
వరంగల్: నేనొస్తే సమస్యలు పరారు అవుతాయని, మురికి వాడల్లో సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్కకుంట్ల చంద్రశేఖర రావు శనివారం అన్నారు. వారం రోజుల్లో ఓరుగల్లుకు మళ్లీ వస్తానని ఆయన చెప్పారు. సీఎం వస్తే పనులన్నీ చకచకా జరగాలన్నారు. పేదలకు ఇళ్లతో పాటు ఆర్థిక సాయం కూడా ఆందాలన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేల వెంటపడి పని చేయించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వచ్చిండంటే అగ్గిపుట్టాలని, పనులన్నీ చకచక జరిగిపోవాలని కేసీఆర్ అన్నారు. పేదలను ఆదుకోవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వరుసగా మూడో రోజైన శనివారం వరంగల్ నగరంలోని మురికివాడలను కేసీఆర్ సందర్శించారు. గుడిసె గుడిసె తిరిగారు. అందులో నివసిస్తున్న నిరుపేదలను పలకరించారు. వారి బాధలను పంచుకున్నారు.
కష్టాలను తీర్చడానికి తానున్నానని అభయమిచ్చారు. నాలుగు నెలల్లో మీ బతుకులు బాగుడతాయని, హామీ ఇచ్చారు. రెండు రోజులుగా వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల పరిధిలోని ఆరు మురికివాడల్లో పర్యటించిన కేసీఆర్ శనివారం.. ఇటీవల వరంగల్ నగర పాలక సంస్థలో విలీనం అయిన వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల పరిధిలోని రెండు మురికివాడలను సందర్శించారు.

కేసీఆర్
ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి ఒత్తిడి మేరకు వారి నియోజకవర్గాల్లోని ఈ రెండు మురికివాడలైన గరీబ్నగర్, ఎస్ఆర్ నగర్లను కేసీఆర్ సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. మురికివాడల్లో ఇళ్లకు పునాది వేసిన మరుసటి రోజు నుంచే పనులు వేగంగా పూర్తి కావాలని, నాలుగు నెలల్లో ఇళ్ళన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కేసీఆర్
ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పనులను దగ్గరుండి చేయించుకోవాలన్నారు. లేకుంటే రాజీనామా చేయాలని పరోక్షంగా హెచ్చరించారు. మా నియోజకవర్గంలోని మురికివాడలను చూడాలని ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మేల్యే ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి పట్టుబట్టి.. నన్ను గొర్రెను గుంజుకొచ్చినట్టు గుంజుకొచ్చిండ్రని, రావడమే మంచిదైందని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్
ఇక్కడి పరిస్థితులు తెలిశాయని, గరీబ్నగర్, ఎస్ఆర్ నగర్లలో పేదలందరికి ఇళ్ళు కట్టిస్తానని, మరి ఎంపీలు, ఎమ్మేల్యేలు కూర్చుని పనులు చేయించుకుంటరా? లేకుంటే రాజీనామాలు చేస్తారా అని ఛలోక్తి విసిరారు. రమేష్, ధర్మారెడ్డిలు ఆ పరిస్థితి రానివ్వమని సీఎంకు హామీ ఇచ్చారు.

కేసీఆర్
వెంటపడి పనులు చేయించుకోవాలని ప్రజలకు కేసీఆర్ చెప్పారు. గరీబ్నగర్ అనే పేరు బాగాలేదని, ఎప్పుడో ఎవడో దిక్కుమాలినోడు ఈ పేరుపెట్టి ఉంటాడని, దీనిని అమీర్నగర్గా మార్చాలని సూచించారు. అనంతరం ఎస్ఆర్ నగర్ను సందర్శించారు. అక్కడ కూడా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

కేసీఆర్
మొదటి రెండు రోజులు పింఛన్లు, రేషన్కార్డుల జారీ, ఇళ్ళ నిర్మాణంపైనే దృష్టి కేంద్రీకరించిన కేసీఆర్ మూడో రోజు గుడిసెవాసుల ఆర్థిక స్థితిగతులను మెరుగు కోసం తీసుకోవలసిన చర్యలపై ఆలోచనలు చేశారు. కూరగాయాల వ్యాపారం చేసుకునేందుకు ఇద్దరు వితంతువులకు చెరో రూ.25వేల ఆర్థిక సహాయాన్ని అక్కడికక్కడే ప్రకటించారు.
వెంటనే వారికి ఆ సాయాన్ని అందజేయాల్సిందిగా కలెక్టర్ను ఆదేశించారు.

కేసీఆర్
మురికివాడల్లో అధికారులతో క్యాంపులు ఏర్పాటు చేసి నిరుపేద దళిత, మైనారిటీలకు చిరు వ్యాపారాలు, వారి చేతనైన పని చేసుకోవడం ద్వారా కుటుంబాలను పోషించుకునేందుకు రుణ సహాయం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు.












Click it and Unblock the Notifications