కెసిఆర్ ఆస్తి రూ. 10 వేలేనట: నాకే చిల్లర దొరకడం లేదంటూ..
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆస్తి పది వేల రూపాయలేనట. ఆ విషయాన్ని స్వయంగా కెసిఆర్ చెప్పారు. తెలంగాణ సంపన్న రాష్ట్రమని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆస్తి ఇదిగో అంటూ సిఎం కెసిఆర్ జేబులోని పదివేలు తీసి చూపించారు.
ఉన్నతాధికారులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించిన సందర్భంలో జేబులోని పదివేలు తీసి చూపిస్తూ ఆ విధంగా చమత్కరించారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన సొమ్ము బ్యాంకులో ఉందని, మేనేజర్కు ఫోన్ చేసి పరిస్థితి ఏమిటని అడిగితే పది వేల వరకూ ఇస్తామన్నారని అన్నారు. చెక్కు పంపితే, పదివేలిచ్చారని అన్నారు. ఇప్పటికిదే పదివేలు అంటూ చమత్కరించారు.
ఈ పది వేలకు చిల్లర దొరికే పరిస్థితి లేదని అన్నారు. ముఖ్యమంత్రి పరిస్థితే ఇలావుంటే, పెద్ద నోటు దెబ్బ రాష్ట్ర ప్రజలపై ఇంకెంత బలంగా ఉందోనని ఆందోళన వ్యక్తం చేశారు. కొనుగోలు, అమ్మకాలు లేక వ్యాపారాలు మొత్తం నిలిచిపోయాయని అన్నారు.
హిమాయత్నగర్లోని మినర్వా హోటల్కు వెళ్లడం తనకు అలవాటని, అక్కడ ఎప్పుడూ పెద్ద సంఖ్యలో ఉండే జనం కనిపించక ఖాళీగా ఉందని ఒక సీనియర్ సెక్రటరీ సిఎంకు తన అనుభవాన్ని వివరించారు. రోడ్లపై ట్రాఫిక్ సైతం తగ్గిపోయిందని, బట్టల షాపులు, ఎలక్ట్రానిక్ షాపుల్లో జనమే కనిపించడం లేదని అధికారులు వివరించారు.
రెండు నెలల్లో పరిస్థితి మెరుగవుతుందని ప్రధాని మోడీ చెబుతున్నా, ఆర్థిక పరిస్థితి తిరిగి పుంజుకోవడం ఇప్పట్లో సాధ్యంకాదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.