ఈ గ్రంథం గొప్ప ప్రయత్నం: ప్రకాష్కు కెసిఆర్ మెచ్చుకోలు
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాల చరిత్ర-రాష్ట్ర ఆవిర్భావం గ్రంథ రచన ఒక గొప్ప ప్రయత్నమని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఇంత సమగ్రంగా తెలంగాణ చరిత్రను ఇంతవరకు ఎవరు కూడా గ్రంథస్తం చేయలేదని ప్రశంసించారు. ఉద్యమ కాలంలో జరిగిన అనేక సంఘటనలను పుస్తక రచయిత ప్రకాశ్ ప్రత్యక్షంగా చూశారని, అధ్యయనం చేశారని అన్నారు.
ఆచార్య జయశంకర్ అధ్యయన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రచయిత వి ప్రకాశ్ రచించిన తెలంగాణ ఉద్యమాల చరి త్ర- రాష్ట్ర ఆవిర్భావం పుస్తకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ అధికార నివాసంలో సోమవారం ఆవిష్కరించారు. వర్తమాన, భవిష్యత్ తరాలవారికి ఈ పుస్తకం చదివితే తెలంగాణ చరిత్ర పరిపూర్ణంగా అవగాహనకు వస్తుందని, ఇది అవశ్య పఠనీయమని ముఖ్యమంత్రి అన్నారు.
భవిష్యత్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే అనేక పోటీ పరీక్షలకు రిఫరెన్స్ మెటీరియల్గా ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్రంలోని పబ్లిక్ లైబ్రరీలతోపాటు కళాశాలలు, ఉన్నత పాఠశాలలు, గ్రంథాలయాల పాఠకులకు కూడా ఈ పుస్తకాన్ని అందుబాటులో ఉంచితే మంచిదని అన్నారు.
ప్రకాష్ కలం నుంచి ఇలాంటి మంచి పుస్తకాలు మరెన్నో వెలువడాలని ఆకాంక్షించారు. పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రకాశ్ దంపతులను సీఎం శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి, ప్రకాశ్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.