ఇక రైతులకు ఉచిత బీమా: ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామన్న సీఎం
హైదరాబాద్: తెలంగాణ రైతులకు ఇక బీమా పథకం అమలు కానుంది. శుక్రవారం రైతు బీమా పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. పథకంపై ప్రగతి భవన్లో ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... ఆగస్టు 15న రైతులకు జీవిత బీమా పథకం ప్రారంభం కానుందన్నారు. దీనికోసం రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఎల్ఐసీతో ఒప్పందం ద్వారా రైతు బీమా పథకం అమలు చేస్తామన్నారు.
రైతు ఏకారణంతో మరణించినా బీమా వర్తిస్తుందని సీఎం తెలిపారు. రైతు బీమాకు సంబంధించి మొత్తం ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు. సాధారణ మరణమైనప్పటికీ నామినీకి 10 రోజుల్లోగా రూ. 5 లక్షల బీమా చెల్లిస్తామన్నారు.
18ఏళ్ల నుంచి 59 ఏండ్ల లోపు రైతులకు బీమా వర్తిస్తుందని సీఎం తెలిపారు. ఎల్ఐసీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం ఆకాంక్షించారు. దేశ చరిత్రలో రైతులకు బీమా సరికొత్త రికార్డు అని ఎల్ఐసీ అధికారులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.