బెడిసికొట్టిన కేసీఆర్ వ్యూహం.. సీఎం కేసీఆర్ ను లైట్ తీసుకున్న ప్రధాని మోడీ? ఆసక్తికరచర్చ
హైదరాబాద్: మోడీ సభను టార్గెట్ చేసిన కేసీఆర్ వ్యూహం బెడిసి కొట్టిందా? మోడీ విజయసంకల్ప సభలో కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా మాట్లాడటం వ్యూహాత్మకమేనా? మోడీ ప్రసంగంలో సీఎం కేసీఆర్ అడిగిన ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదని టీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్న సమయంలో మోడీ స్ట్రాటజీపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు: టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు కొనసాగిన వార్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం, ప్రధాని నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోసం ప్రయత్నించటం వంటి అంశాలు తెలంగాణ రాజకీయాలలో ఉత్కంఠను రేకెత్తించాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తారని ప్రకటించిన నాటి నుండి, బిజెపి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయడానికి టిఆర్ఎస్ పార్టీ శతవిధాలా ప్రయత్నం చేసింది. బిజెపిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం మాత్రమే కాకుండా, ఫ్లెక్సీల విషయంలో కూడా రాజకీయం చేసింది.

కేసీఆర్ ను పట్టించుకోని ప్రధాని మోడీ
ఇక బీజేపీ నుంచి పలువురు కార్పొరేటర్లను గులాబీ తీర్థం పుచ్చుకునేలా చేసి షాక్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ వర్సెస్ బిజెపి వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ వెళ్లకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన చేసినా, యశ్వంత్ సిన్హా కు ఘనంగా స్వాగతం పలికి, ఆపై సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ రేపు తనను చీల్చిచెండాడతాడు అని ఆవేశంగా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం సీఎం కేసీఆర్ ను, టిఆర్ఎస్ పార్టీ ని అంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి కనిపించలేదు.

కేసీఆర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని పీఎం మోడీ
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బిజెపి విజయ సంకల్ప సభ లో మోడీ నోటి వెంట కెసిఆర్ గురించి ఒక్క మాట కూడా రాలేదు. తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం విమర్శించకుండా మోడీ ప్రసంగం సాగింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని, కేంద్రం నుండి తెలంగాణ ప్రజలకు అందుతున్న పథకాల గురించి మాత్రమే చెబుతూ మోడీ తన ప్రసంగాన్ని సాగించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం లేదని, సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలియజేసే ప్రయత్నం చేశారు ప్రధాని మోడీ.

కేసీఆర్ గురించి మోడీ మాట్లాడకపోవటం వ్యూహాత్మకమేనా?
తెలంగాణ రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కార్ రావడం పక్కా అంటూ పేర్కొన్న మోడీ, కెసిఆర్ ప్రస్తావన తీసుకు రాకపోవడం, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్, బీజేపీల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకున్నా, దాని గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం, విమర్శలు చేయకపోవడం పై తెలంగాణ రాజకీయవర్గాలలో ప్రజలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ కు మోడీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లడం కోసమే మోడీ వ్యూహాత్మకంగానే కెసిఆర్ గురించి ఏమీ మాట్లాడలేదని చర్చ జరుగుతుంది.

కేసీఆర్ గురించి మాట్లాడితే అనవసరంగా ప్రాచుర్యం కల్పించటమేనా ?
మోడీ రాకముందు సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి అనేక ప్రశ్నలు సంధించినా, టిఆర్ఎస్ నేతలు ఎంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం అవేవి పట్టించుకోలేదని చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కెసిఆర్ గురించి మాట్లాడితే ఆయనకు అనవసరంగా హైప్ క్రియేట్ చేసినట్టు అవుతుందని మోడీ భావించినట్లుగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మోడీ కేసీఆర్ గురించి ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం టీఆర్ఎస్ నేతలను నిరాశకు గురి చేసినట్లు ఉందని కూడా చెప్పుకుంటున్న పరిస్థితి లేకపోలేదు.

దేశ్ కి నేత అని చెప్పుకుంటున్న కేసీఆర్ ను దేశ ప్రధాని పట్టించుకోకపోవటం టీఆర్ఎస్ కు షాక్
తమను బిజెపి ప్రత్యర్థిగా గుర్తిస్తే, ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేస్తే, దేశవ్యాప్తంగా కేసీఆర్ పై ప్రధానంగా దృష్టి పడుతుందని, బిజెపికి తాము పోటీ అన్నట్టు దేశ రాజకీయాల్లో ముందుకు రావచ్చని భావించిన టిఆర్ఎస్ పార్టీ దేశ్ కి నేత అని చెప్పుకుంటున్న కేసీఆర్ ను మోడీ పట్టించుకోకపోవడంపై తీవ్ర నిరాశలో ఉన్నట్టుగా సమాచారం. బిజెపి సమావేశాల సందర్భంగా, విజయ సంకల్ప సభ సందర్భంగా మాటల తూటాలు పేలటం కోసం శతవిధాలా ప్రయత్నం చేసిన టిఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది అని బిజెపి నేతలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications