'అసెంబ్లీలో కేసీఆర్ షోలే సినిమా!.. టిప్టాప్గా రెడీ అయి..'
టిప్ టాప్ గా రెడీ అయి 12గం.కు అసెంబ్లీకి వస్తున్న కేసీఆర్.. సభలో 'షోలే' సినిమా చూపిస్తున్నారని రేవంత్ విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ కాకుండా బొందలగడ్డగా మారుతోందన్నారు.
బుధవారం అసెంబ్లీ లాబీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా రైతు సమస్యలతో పాటు పలు అంశాలను ప్రస్తావిస్తూ సీఎంపై విమర్శలు చేశారు. అసెంబ్లీలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ కేసీఆర్ ఏకపాత్రాభినయం చేస్తున్నారని విమర్శించారు. టిప్ టాప్ గా రెడీ అయి 12గం.కు అసెంబ్లీకి వస్తున్న కేసీఆర్.. సభలో 'షోలే' సినిమా చూపిస్తున్నారని అన్నారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో ఆత్మహత్యలు పెరిగాయన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత 2300మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. చనిపోయిన రైతు కుటుంబాలను సీఎం పరామర్శించాలని, వారి కుటుంబాలకు రూ.6లక్షల నష్ట పరిహారం అందజేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.