ఖాళీల భర్తీ: కెసిఆర్, కొరడా: నిధులపై కెటిఆర్
హైదరాబాద్: అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను త్వరలో ఖాళీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ప్రకటించారు. శనివారంనాడు ఆయన దూలపల్లి ఫారెస్ట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అటవీశాఖ లోగోని ఆవిష్కరించారు. అనంతరం ఆయన అటవీశాఖ అధికారులతో సమావేశమయ్యారు. అడవుల రక్షణలో గత ప్రభుత్వాలు చాలా ఉదాసీనంగా వ్యవహరించాయని కేసీఆర్ అబిప్రాయపడ్డారు.
తమ ప్రభుత్వం అడవుల పరిరక్షణకు చాలా కఠినంగా వ్యవహరిస్తుందని, అందుకోసం కొత్త చట్టాలను రూపొందించనున్నామని కేసీఆర్ ప్రకటించారు. అటవీశాఖ కేసులను పరిష్కరించడానికి ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని, అటవీ సిబ్బందికి రక్షణగా సాయుధ పోలీస్ బలగాలను దింపుతామని కేసీఆర్ ప్రకటించారు. దొంగ ఆర్ఓఎఫ్ఓలపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
కాగా, నిధుల దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. పంచాయతీల్లో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని ఆయన శనివారం చెప్పారు. గ్రామ కార్యదర్శులు ప్రభుత్వ సేవలను ప్రజల వద్దకు తీసుకుని వెళ్లాలని ఆయన అన్నారు.
పంచాయతీరాజ్ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. నిధులు దుర్వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శుల కరదీపికను, డైరీని కెటిఆర్ ఆవిష్కరించారు.
తెలంగాణలో ఈపీసీ టెండర్ల విధానాన్ని రద్దు చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ కెబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు సమావేశంలో అనంతరం మీడియాకు చెప్పారు. దాంతో పాటు పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, మున్సిపల్ రోడ్లపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. గతంలో ఉన్న కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. టెండర్ల విధానంలో మార్పులుచేర్పులపై చర్చించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.