రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడం కేసీఆర్ విజయం.!క్రెడిట్ టీఆర్ఎస్ దే అంటున్న మంత్రులు.!
హైదరాబాద్ : దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన, పరిపాలన దక్షత కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అని మోడీకి తెలుసని, చంద్రశేఖర్ రావు గురువారం ఆందోళనకు దిగడం కూడా కేంద్రంలో చలనానికి ఒక కారణమని, ఈర్శ, ద్వేషాలతో ఇక్కడి బీజేపీ నేతలు చంద్రశేఖర్ రావు ప్రతిభను ఒప్పుకోకున్నా, ఏడేండ్ల తెలంగాణ ప్రభుత్వ విజయాలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి తెలుసని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతాంగ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తే ఏం జరుగుతుందో మోడీ ప్రభుత్వానికి తెలుసు కాబట్టే రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారని మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, విప్ గొంగిడి సునిత, విప్ బాల్క సుమన్ స్పష్టం చేసారు.
Recommended Video
రైతు చట్టాల ఉపసంహరణ గులాబీ విజయం.. హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ మంత్రులు
వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవడం చంద్రశేఖర్ రావు విజయమని, మహాధర్నా విజయమని మంత్రులు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, పంపిణీ భారత ప్రభుత్వ విధి అని రాజ్యాంగమే తేల్చిచెప్పిందని, దేశంలో వ్యవసాయ స్థిరీకరణకు ప్రధాని స్థాయిలో ఇప్పటికైనా ఒక చర్చ పెట్టాలని, పంటల సాగు, జాతీయ, అంతర్జాతీయ డిమాండ్ మీద పరిశీలన చేసి రైతాంగానికి దిశానిర్దేశం చేసి సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేయాలని మంత్రులు డిమాండ్ చేసారు. అంతే కాకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతు చట్టాల రద్దు గురించి గత కొన్నేళ్లుగా కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారని మంత్రులు గుర్తు చేసారు.
వరి ధాన్యం కేద్రం కొనాలి.. డిమాండ్ చేసిన మంత్రులు..
కార్పోరేట్ పారిశ్రామిక వేత్తలకు 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేసిన కేంద్రం ఈ దేశ రైతాంగం కోసం వ్యవసాయరంగాన్ని పటిష్టం చేసేందుకు నిధులు కేటాయించే బాధ్యత లేదా అని మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. వ్యవసాయరంగంలో సమూల మార్పులు తెచ్చి ఈ దేశ యువతను వ్యవసాయ రంగం వైపు మళ్లించాలని మంత్రులు సూచించారు. తెలంగాణలో పండిస్తున్న వరిని కేంద్రం కొనుగోలు చేయాలని, తెలంగాణలో వరి సాగును కేంద్రం ప్రోత్సహించి, ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాద్యత కేంద్రప్రభుత్వంపై ఉందని గుర్తుచేసారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని, ప్రధాని మోడీ స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని మంత్రులు డిమాండ్ చేసారు.
రైతు చట్టాల గురించి కాంగ్రెస్ మాట్టాడటం విడ్డూరం.. మండిపడ్డి మంత్రులు
అంతే కాకుండా రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ అని, దాన్నిఅమలుకు యత్నించింది మోదీ ప్రభుత్వమని గులాబీ మంత్రులు మండిపడ్డారు. ఈ నల్లచట్టాలను 2019 తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొందని తెలిపారు. దేశ రైతాంగం ఏడాదికి పైగా చేసిన పోరాటంలో కాంగ్రెస్ పాత్ర ఏమీ లేదని మండిపడ్డారు. నల్లచట్టాలు గొప్పవని ప్రచారం చేసిన స్వయం ప్రకటిత మేధావులు జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. తమ అవివేకపు వాదనపు తప్పుదారి పట్టించినందుకు సిగ్గుపడాలని, నల్లచట్టాల గురించి రైతులకు కూలంకషంగా అర్దమయిందని భావించే కేంద్రం వెనక్కు తగ్గిందని మంత్రులు స్పష్టం చేసారు.
మహాధర్నాకు భయపడ్డ మోదీ.. అందుకే చట్టాలు రద్దు చేసారన్న తెలంగాణ మంత్రులు
గత కొన్నాళ్లుగా తెలంగాణ ధాన్యం కొనుగోలు కోసం జరుగుతున్న పరిణామాలు, చంద్రశేఖర్ రావు స్వయంగా ఢిల్లీ వెళ్లడం, లేఖలు, వాదోపవాదాలు, తెలంగాణ బీజేపీ అసంబద్ధ వైఖరి వెరసి తెలంగాణ ప్రభుత్వం ఆందోళణ బాట పట్టే అగత్యం కలిగిందని మంత్రులు తెలిపారు. ఉత్తరాది రైతు ఆందోళనలు దక్షిణాదికి విస్తరిస్తే దానికి చంద్రశేఖర్ రావు నాయకత్వం వహిస్తే కేంద్ర ప్రభుత్వ ఉనికికి ముప్పు అని భావించినట్లు అర్ధమవుతుందని, గురువారం చంద్రశేఖర్ రావు ధర్నాలో ఆ దిశగా సంకేతాలు పంపించారని మంత్రులు స్పష్టం చేసారు.