సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ మద్దతంటూ రేవంత్: తెలంగాణ జోలికి రావొద్దంటూ మరో ఎంపీ
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సమైక్య వ్యాఖ్యలపై తెలంగాణ నేతల నుంచి విమర్శలు తగ్గడం లేదు. తాజాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణను ఏపీలో కలిపేందుకు సహకరిస్తామని సజ్జల చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఏమాత్రం స్పందించలేదన్నారు.

సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ మద్దతంటూ రేవంత్ ఫైర్
తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా సీఎం కేసీఆర్ అంగీకరించడం లేదని రేవంత్ మండిపడ్డారు. సజ్జల చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉందని అన్నారు. ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగిందని.. ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహమిది అని ధ్వజమెత్తారు రేవంత్. ఇది నిజంగా తెలంగాణకు బ్లాక్ డే అవుతుందన్నారు.

తెలంగాణతో కేసీఆర్కు బంధం తెగిపోయిందన్న రేవంత్
మేధావులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని రేవంత్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితిగా మార్చారని, దీంతో ఈ రోజు నుంచి కేసీఆర్ కు తెలంగాణ పేగు బంధం తెగిపోయిందని అన్నారు. తెలంగాణతో, తెలంగాణ ప్రజలతో పేగు బంధంతోపాటు పేరు బంధం కూడా తెగిపోయిందన్నారు రేవంత్. తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్ కృష్ణార్పణం చేశారన్నారు.

తెలంగాణ జోలికి రావొద్దంటూ సజ్జలకు అరవింద్ కౌంటర్
మరోవైపు, సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన సమైక్య వ్యాఖ్యలపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. సీఎం జగన్ తన సలహాదారుడిని మార్చుకోవాలన్నారు. సజ్జల లాంటి వ్యక్తులను సలహాదారులుగా పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. మళ్లీ ఆంధ్రను తమిళనాడులో కలుపుకోవాలని చెప్పాలి తప్ప.. తెలంగాణ జోలికి రావొద్దు అని హెచ్చరించారు. కాగా, తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే తమ విధానమని, అలా జరిగితే మొదట స్వాగతించేది వైసీపీనేనని సజ్జల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ నేతలు సజ్జలకు కౌంటర్లు ఇచ్చారు. షర్మిల కూడా సజ్జల వ్యాఖ్యలను తప్పుబట్టారు. మీ ప్రాంతం గురించి మీరు చూసుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications