సీఎం రేవంత్ పై కేసీఆర్ గురి - అనూహ్య నిర్ణయం..!!
మాజీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా రాజకీయంగా కేసీఆర్ మౌనం పాటిస్తున్నారు. తాజా వరదల పైన కేసీఆర్ స్పందించలేదు. కవిత అరెస్ట్ తరువాత కేసీఆర్ రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు. ఇక, ఇప్పుడు తిరిగి యాక్టివ్ కావాలని నిర్ణయించారు. రేవంత్ సర్కార్ పై రాజకీయ పోరాటానికి సిద్దమవుతున్నారు. ఇక పార్టీ..ప్రజల్లోనే ఉండాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఈ నెల 11న పార్టీ కీలక సమావేశం ఏర్పాటు చేసారు.
కేసీఆర్ కార్యాచరణ
మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా కొత్త కార్యాచరణతో సిద్దం అవుతున్నారు. ఈనెల 11న తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. పార్టీ ముఖ్యనేతలందరూ హాజరు కావాలని ఇప్పటికే నేతలకు సందేశాలు వెళ్లాయి. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమస్యలపై... ఈ సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేయడంలో విఫలమవ్వడం తదితర అంశాలను ప్రజల్లోకి ఏవిధంగా తీసుకువెళ్లాలన్న దానిపై కేసీఆర్ నేతలతో చర్చించనున్నారు.

పార్టీ నేతలతో భేటీ
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా ప్రభుత్వం పైన పోరాటంతో పాటుగా ప్రజల్లోనే ఉండేలా కేసీఆర్ కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తరువాత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశాలుగా మారిన రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, జీవో నెంబర్ 46, పెన్షన్లు ఇలా రకరకాల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు వెళ్లాలనేది కేసీఆర్ ఈ సమావేశంలో దిశా నిర్దేశం చేయనున్నారు. ఇక పూర్తి స్థాయిలో పార్టీ పైన దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రజల్లోకి కేసీఆర్
రైతుల సమస్యలపై జిల్లాల పర్యటనలు చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 11న సమావేశంలో దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు చేయనున్నారు. రైతులు, మహిళలు, మేధావులతో సమావేశాల ఏర్పాటుకు నిర్ణయించారు. కొద్ది రోజుల్లో స్థానిక పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. దీంతో, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపటంతో పాటుగా ప్రతిపక్ష పాత్రలో మరింత యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ పార్టీ పరంగా ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలో ఈ నెల 11న జరిగే పార్టీ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నారు.












Click it and Unblock the Notifications