నా ఊరును చూస్తే ఏడుపొచ్చింది, కర్మ ఇంతేనా: కెసిఆర్
సంగారెడ్డి: తన గ్రామం ఎర్రవల్లిని చూస్తే గంటసేపు గుక్కతిప్పుకోకుండా ఏడ్చినా సరిపోనంత బాధ కలిగిందని, కూలిపోయిన, విడిచిపెట్టిన ఇళ్లు చూస్తే బాధేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. మన కర్మ గింతేనా? ఎంతకాలం ఇలా ఉందామని ఆయన ప్రజలను ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఎర్రవల్లి గ్రామం నుంచే తెచ్చానని, ఇప్పుడు ఈ ఎర్రవల్లిని ఆరు నెలల్లో బంగారువల్లిగా మారుస్తానని, గ్రామంలోని ప్రతి బస్తీనీ అద్దంలా మెరిసేలా చేసి రాష్ట్రంలో నెంబర్ వన్గా తీర్చిదిద్దుతానని తెలంగాణ ఆయన అన్నారు.
‘మీ స్వంత గ్రామం ఎర్రవల్లి సంగతి ఏంద'ని ఎవరైనా తనను ప్రశ్నిస్తే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. అందుకే సొంత ఊరికి ‘గ్రామజ్యోతి'ని తీసుకొచ్చానని వివరించారు. మెదక్ జిల్లా జగదేవ్పూర్ మండలంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న గ్రామం అయిన ఎర్రవల్లిలో గురువారం ఆయన ‘గ్రామ జ్యోతి'లో పాల్గొన్నారు. గ్రామంలో రెండు గంటల పాటు పర్యటించి, గ్రామ పరిస్థితిని, ప్రజల స్థితిగతుల గురించి ఆరా తీశారు.
అనంతరం నిర్వహించిన గ్రామజ్యోతి సభలో కేసీఆర్ ప్రసంగించారు. గ్రామ జనాభా 1500 అయితే, పని చేసేవారు వెయ్యి మంది ఉంటారని, వీరంతా కలిస్తే రెండు వేల చేతులవుతాయని, అప్పుడు గ్రామంలో మురికి ఉండదని, పరిశుభ్రమౌతుందని చెప్పారు. గ్రామంలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను రెండు రోజుల్లో తీసివేద్దామని, ముళ్లచెట్లను, గడ్డ్డిని తొలగిద్దామని, మీరు ముందుకొచ్చి చెబితే ఏ పని అయినా చేస్తానని మీరు ఆదేశిస్తే మోరీలు తీస్తానని అన్నారు.
దీనికోసం.. మహిళలు, యువకులు, విద్యార్థులు, వ్యవసాయ పనులు రెండురోజుల పాటు పక్కన పెట్టి గ్రామంపై శ్రద్ధ చూపాలన్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పని ప్రారంభిద్దామని, మధ్యాహ్నం గ్రామంలోనే అందరికీ భోజనం పెట్టిస్తానని, ప్రజలతోనే తానూ భోజనం చేస్తానని, అందరం కలిసి శుక్రవారం ఊరిని శుభ్రం చేసుకొందామనిస, శనివారం ఊరంతా మొక్కలు నాటుకొందామని చెప్పారు.
పాడుబడిన ఇళ్లను కూల్చివేసి కొత్తవి కట్టించడం, రెండు రోడ్లను ఇరుకుగా కాకుండా రెండు లేన్లుగా మార్చడం.. అనే పనులను గ్రామంలో గుర్తించామని, దానికోసం రెండు రోజుల పాటు (శుక్ర, శనివారాలు) 20 మంది ఇంజనీర్లు ఇక్కడే ఉండి గ్రామస్వరూపంపై సర్వే చేస్తారని చెప్పారు. సర్వే శనివారం పూర్తయితే అప్పుడే ఇళ్లను మంజూరు చేసేస్తారని చెప్పారు. గ్రామ అభివృద్ధిలో అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించేవిధంగా.. ‘సర్వవర్గసమితి'ని ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు.
గ్రామ అభివృద్ధిలో నిజామాబాద్ జిల్లా అంకాపూర్ను ఆదర్శంగా తీసుకోవాలని ఎర్రవల్లి గ్రామస్థులకు సీఎం కేసీఆర్ సూచించారు. ఎర్రవల్లి.. అంకాపూర్కు ఏమాత్రం తక్కువ కాదని, గ్రామం బాగుపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఉత్సాహపరిచారు. ‘రాష్ట్ర ముఖ్యమంత్రే ఎర్రవల్లికి చెందిన వాడు. ఏదడిగితే అది మంజూరు చేస్తాడు. నన్ను మీరు ఎట్లా వాడుకుంటారన్నదే ప్రశ్న' అని వ్యాఖ్యానించారు.