భారీ ప్లాన్: హరీష్ రావు నుంచి కెసిఆర్ ఆ శాఖ తీసేసుకోవాలనుకున్నారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రి హరీష్ రావు నుంచి ఇరిగేషన్ (నీటి పారుదల) శాఖను తీసుకోవాలని భావించారా? అంటే కావొచ్చునని మీడియాలో వార్తలు వస్తున్నాయి. హరీష్ రావు నుంచి తొలుత ఇరిగేషన్ శాఖను తీసుకోవాలని కెసిఆర్ భావించారని తెలుస్తోంది.
హరీష్ రావు బాగా పని చేస్తాడనే పేరు ఉంది. ఆయన నియోజకవర్గమైన సిద్దిపేటలో ఆయనకు తిరుగు లేదు. తెలంగాణవ్యాప్తంగా హరీష్ రావుకు అభిమానులు ఉన్నారు.
అయితే, నీటి పారుదలకు ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ శాఖకు బడ్జెట్ నుంచి ప్రతి ఏడాది రూ.25వేల కోట్లు కేటాయిస్తున్నారు.
కెసిఆర్ నీటి పారుదల ప్రాజెక్టులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని గురించే ఆయన పదేపదే చెబుతున్నారు. ఓ విధంగా.. తెలంగాణ రాష్ట్రంలో ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది నీటి పారుదల. ఇందుకోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్ కూడా చేయిస్తున్నారు.
ప్రాజెక్టుల పైన మార్చి 31వ తేదీన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కెసిఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను సంబంధిత శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు అందరూ మనసు పెట్టి విన్నారు. నీటి పారుదల, ప్రాజెక్టుల రీడిజైనింగ్ గురించి కెసిఆర్కు చాలా పట్టు ఉంది.
ఈ నేపథ్యంలో తనకు ఇష్టమైన, తెలంగాణకు నీటి సమస్యను తీర్చే ఇరిగేషన్ శాఖను తన వద్ద ఉంచుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావించారని వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితమే ఐదుగురు మంత్రులకు శాఖలు మార్పులు, చేర్పులు చేసిన విషయం తెలిసిందే.
దీని కోసం కెసిఆర్ పదిహేను రోజుల పాటు కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా హరీష్ రావు వద్ద ఉన్న ఇరిగేషన్ శాఖను తాను తీసుకోవాలని భావించినట్లుగా తెలుస్తోంది.
అయితే, మంత్రి హరీష్ రావు మూడుసార్లు కెసిఆర్ చుట్టు తిరిగి తనకు ఇన్ని మంత్రిత్వ శాఖలు ఉండటంతో ఒత్తిడి పెరుగుతోందని, మైనింగ్ శాఖ తనకు వద్దని హరీష్ రావు ముఖ్యమంత్రికి చెప్పారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా హరీష్ రావు కోరినందున మైనింగ్ శాఖను తీసుకొని కొడుకు కెటిఆర్కు అఫ్పగించి ఉంటారని అంటున్నారు.