కేసీఆర్ హైలెవల్ మీటింగ్.. సడలింపులపై తేల్చేస్తారా.. ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం(మే 15) ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. లాక్ డౌన్ సడలింపులు,సమగ్ర వ్యవసాయ విధానంపై అధికారులతో ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్రం ప్రకటించిన సడలింపులు ఆయా రాష్ట్రాలు ఇప్పటికే అమలుచేస్తున్న నేపథ్యంలో.. అక్కడి పరిస్థితులపై చర్చించి తెలంగాణలోనూ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు. ముఖ్యంగా ప్రజా రవాణా విషయంలో నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సడలింపులకు ఓకె చెప్తారా..?
రెడ్ జోన్లు మినహా గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో నియంత్రిత పద్ధతిలో ప్రభుత్వం చాలావరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల నిర్వహణకు అనుమతించింది. అయితే వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిన రెడ్ జోన్లలోనూ సడలింపులకు అనుమతించే అవకాశం ఉంది. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో కేసుల పెరుగుదలపై చర్చించనున్నారు. కరోనా టెస్టులు, పరిశ్రమల రీఓపెన్, పదో తరగతి పరీక్షలపై చర్చలు జరపనున్నారు.

ఆర్టీసీపై కీలక నిర్ణయం ఉంటుందా..?
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 50శాతం ఆక్యపెన్సీతో బస్సులను నడుపుతున్నారు. పలు రాష్ట్రాల్లోనూ ఇప్పటికే ఆర్టీసీ సర్వీసులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్టీసీ సర్వీసుల పునరుద్దరణపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే క్యాబ్స్,ఆటో సర్వీసులపై కూడా సమాలోచనలు జరపనున్నారు. మే 15 తర్వాత గ్రీన్ జోన్లలో ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా కొన్ని నిబంధనలతో ఆర్టీసీని పునరద్దరించే అవకాశం ఉంది.
Recommended Video

సాయంత్రం మీడియా ముందుకు..?
ఇక నియంత్రిత పద్దతిలో సమగ్ర వ్యవసాయ సాగు విధానం,కొత్త విద్యా సంవత్సరం,వలస కూలీల సమస్యలపై కూడా కేసీఆర్ చర్చించనున్నారు. కరోనాతో కలిసి జీవించడం తప్పదని.. అందుకు అనుగుణంగా అవసరమైన వ్యూహాలు,ప్రణాళికలు సిద్దం చేయాలని కేసీఆర్ ఇదివరకే అధికారులను ఆదేశించారు. తాజా సమీక్ష సమావేశంలో ఆ నివేదిక సీఎంకు అందే అవకాశం ఉంది. అందులో పేర్కొన్న అంశాల ఆధారంగా సీఎం తుది నిర్ణయం తీసుకుంటారు. సమావేశం అనంతరం ఆయన మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications