చంద్రబాబులాగే కేసీఆర్ కూడా అధికారం పోగొట్టుకుంటారు .. సీపీఐ నేతల సంచలనం
సీపీఐ నేతలు నారాయణ, చాడా వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న వారు తెలంగాణా సీఎం కేసీఆర్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాగే కేసీఆర్ కూడా అధికారం కోల్పోయే రోజు వస్తుందంటూ వ్యాఖ్యానించారు. అటు దేశంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పాలక ప్రభుత్వాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
సీపీ ఐ నేత నారాయణ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో అతి త్వరలో టీడీపీ పూర్తిగా కనుమరుగు అవుతుందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ కనీసం పోటీ చెయ్యలేని స్థితి అందుకు నిదర్శనం అన్నారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ ఎస్ పార్టీకి సరైన తీర్పు ఇచ్చారని చెప్పారు. ఎలాగైతే చంద్రబాబు 2019ఎన్నికల్లో ఓటమి పాలయ్యారో, అధికారం కోల్పోయారో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అలాగే ఓటమి పాలవుతారని ఆ రోజు ఎంతో దూరంలో లేదు అన్నారు సీపీఐ నేత నారాయణ .
ఇక కేంద్ర మంత్రి మండలిలో 52 మంది నేరస్థులు ఉన్నారని పేర్కొన్నారు చాడా వెంకట్ రెడ్డి . ఇక తెలంగాణ ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అప్పుల మయంగా మారిందని , అప్పుల మినహా రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రజలు ఏకం కాకపోయినా, పోరాడకపోయినా, భవిష్యత్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాము అని వెంకటరెడ్డి పేర్కొన్నారు . ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది అని ఆయన అన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.