దేశంలో రోల్ మోడల్గా తెలంగాణ, సంకల్పం గట్టిదైతే: ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ ప్రసంగం
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఉదయం నగరంలోని పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. అనేకమంది అమరుల త్యాగాలతోనే తెలంగాణ స్వప్నం సాకారమైందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. తెలంగాణ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని అన్నారు. అభివృద్ధిలో దేశంలో నెంబర్ వన్గా నిలిచిందని అన్నారు.
ఏకైక రాష్ట్రం
ప్రజల సంక్షేమం కోసం పాడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ అన్నారు. తమ ప్రభుత్వంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని చెప్పారు. 24గంటలపాటు విద్యుత్ సౌకర్యాన్ని అందిస్తున్నామని తెలిపారు. సమైక్య పాలకుల హయాంలో తెలంగాణ ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇక్కడ కాంగ్రెస్ ఆ విధానాలను వ్యతిరేకించలేదని అన్నారు.
బంగారు తెలంగాణ దిశగా..
మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుని గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని కేసీఆర్ చెప్పారు. ఇతర చిన్న చిన్న ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం ద్వారా సాగు అందిస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో పూర్తయిన ప్రాజెక్టులతో వేల ఎకరాల్లో పంటలు పడుతున్నాయని చెప్పారు. ఎన్నికల మెనిఫేస్టోను అమలు చేస్తున్నామని చెప్పారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలతో సాగు, తాగు నీరు అందిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రైతు బంధు పథకంతో రైతుల్లో నూతనోత్సాహం వచ్చిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల రైతులు కూడా తెలంగాణలోలా పథకాలు రూపొందించమంటున్నారని చెప్పారు. బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. దేశం దృష్టిని తెలంగాణ ఆకర్షిస్తోందని అన్నారు.
రైతుకు ఉచిత బీమా
కుటుంబం పెద్ద దిక్కు కోల్పోతే వారికి అండగా ఉండేందుకు రైతులకు ఉచిత జీవిత బీమా పథకం ప్రారంభించామని కేసీఆర్ చెప్పారు. చనిపోయిన పదిరోజుల్లోనే బాధితుడి కుటుంబానికి రూ.5లక్షల మొత్తం అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ జీవిత బీమా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. ఎల్ఐసీ ద్వారా జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి రైతులు ఎలాంటి ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
జాతీయ రహదారుల అభివృద్ధి
తెలంగాణ ఏర్పడకముందు జాతీయ రహదారులు తక్కువగా ఉండేవని... ఇప్పుడు కేంద్రంపై ఒత్తిడి చేసి 3157 జాతీయ రహదారులు సాధించుకున్నామని చెప్పారు. గతంలో పేదలకు ఇళ్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని, వాటిపై విచారణ చేపట్టామని తెలిపారు. పేదలు చెల్లించాల్సిన 4వేల కోట్ల రూపాయల రుణ బకాయిలను రద్దు చేశామని చెప్పారు.
ఉచితంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు
పేదలకు 100శాతం ప్రభుత్వ నిధులతో 2,45,000 డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి అందిస్తున్నామని, ఇప్పటికే పలువురికి అందించడం జరిగిందని అన్నారు. హైదరాబాద్ లోనే లక్షకుపైగా ఇల్లు నిర్మిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కిట్ పేరుతో గర్భవతులు, బాలింతలకు ఆర్థిక సాయంగా రూ.12వేలు అందిస్తున్నామని చెప్పారు. దీంతో 2వేల రూపాయల కిట్ కూడా అందిస్తున్నామని తెలిపారు. 2లక్షల మంది మహిళలకు ప్రయోజనాలు అందాయని చెప్పారు.
ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిందని, విసుక్కోకుండా వైద్యం అందిస్తున్న వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని సౌకర్యాలు తీసుకొచ్చామని తెలిపారు. గవర్నర్ కూడా గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేసుకుని, వైద్య సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. కంటి వెలుగు అనే పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని.. ఈ పథకంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అవసరమైన వారికి ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని చెప్పారు. కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణకు గర్వకారణం
గురుకులాలు, డిగ్రీ గురుకులాలను అన్ని వసతులతో ఏర్పాటు చేశామని, విద్యార్థులకు డ్రెస్సులు, పౌష్టికాహారం అందించడం జరుగుతోందని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారని చెప్పారు. జగిత్యాలకు చెందిన యువకుడు సివిల్స్లో ప్రథమ స్థానంలో రావడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. చాలా మంది విద్యార్థులు రాష్ట్రానికి గుర్తింపు తెస్తున్నారని అన్నారు.
నూతన పారిశ్రామిక విధానంతో..
హరితహారంతో ఆకు పచ్చ తెలంగాణకు కృషి చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గిరిజనులు, ఆదివాసీల డిమాండ్లను సాకారం చేశామని అన్నారు. నూతన పారిశ్రామిక విధానంతో అనేక పరిశ్రమలు వచ్చాయని, 7వేల కంపెనీలు వచ్చాయని అన్నారు. కోట్ల పెట్టుబడులతో కంపెనీల రావడంతో సుమారు 5లక్షల మందికి ఉపాధి లభించిందని అన్నారు.
సంకల్ప గట్టిదైతే..
శాంతి భద్రతల కోసం పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించడం జరుగుతోందని అన్నారు. గుడుంబా, పేకాటలను పూర్తిగా లేకుండా చేశామన్నారు. కల్తీ లేకుండా చేస్తున్నామని, పీడీ యాక్టులు పెడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని.. కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. సంకల్పం గట్టిదైతే ఎన్ని అడ్డంకులు ఎదురైనా సాధించడం సులభేనని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. జై తెలంగాణ.. జై భారత్ అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు. అంతకుముందు గన్పార్క్ వద్ద అమరవీరులకు కేసీఆర్ నివాళులర్పించారు.