కేసీఆర్ మాటలు నీటి మూటలే.!రాచకొండలో ఫ్యాబ్,స్పోర్ట్ సిటీలు ఏమయ్యాయని ప్రశ్నించిన టీటీడిపి.!
హైదరాబాద్ : గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చలేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. తెలంగాణలో జరిగిన అభివృద్దిపై క్షేత్రస్తాయిలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచిస్తోంది తెలుగుదేశం పార్టీ. ఈ నెల 15 బుధవారం రోజున రాచకొండలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు పర్యటించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ తెలిపారు.
నారాయణపురం మండల కేంద్రంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఐలయ్య మాట్లాడారు. రాచకొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పర్యటించిన సందర్భంలో ఫిలింసిటీ, ప్యాబ్ సిటీ, స్పోర్ట్ సిటీని అభివృద్ది చేస్తానని, అన్ని రంగాలలో ముందడుగు వేస్తానని చెప్పి డిసెంబర్ 15 నాటికి ఏడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ హామీలు అమలుకు నోచుకోలేదని చంద్రశేఖర్ రావు మాటలు నీటి మూటలే అయ్యాయని విమర్శించారు.
రాచకొండకు చంద్రశేఖర్ రావు రావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలందరు ఆశ పడ్డారని, కానీ గత ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజు కుంటుందని ఆవేదన వ్యక్తం చేసారు. రాచకొండ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బక్కని నర్సింహులు రాచకొండ కు చేరుకొని చంద్రశేఖర్ రావు పర్యటించిన ప్రాంతాన్ని, అధికారులు ఇబ్బందులు పెడుతున్న గిరిజన భూములను సందర్శిస్తారని తెలిపారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల గురించి గిరిజనులతో మాట్లాడడం జరుగుతుందని చెప్పారు. రాచకొండ రైతాంగ భూ సమస్యలు పరిష్కరించడం కోసం రైతు భీమా, రైతుబంధు పథకాలు వర్తింపచేసేందుకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందన్నారు.