మేం ఉన్నాం: రైతులకు కెసిఆర్ బహిరంగ లేఖ
హైదరాబాద్: రైతులకు భరోసా కల్పించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అడుగు ముందుకు వేశారు. రైతులకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూ తీవ్ర చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తూ ఆయన బహిరంగ లేఖ రాశారు. రైతులకు మనోధైర్యం కల్పించడానికి ఆయన ఈ లేఖను ఉద్దేశించారు.
‘‘రైతన్నలారా.. ప్రకృతి సహకరించక, పంట చేతికి రాక మీరు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. మీకు అండగా మేమున్నాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వానికి తెలియజేయండి. తక్షణమే పరిష్కార చర్యలు చేపడతాం..'' అని ఆయన చెప్పారు.

‘‘ఆత్మహత్య చేసుకుంటే మీ కుటుంబ సభ్యులు పడే ఆవేదనను అర్థం చేసుకోండి. మరణం సమస్యలను తీర్చకపోగా మీ కుటుంబానికి కొత్త సమస్యలను సృష్టిస్తుంది. నా విన్నపం ఒక్కటే. ఎన్నో త్యాగాలతో, ఎన్నో కష్టాలతో, ఎన్నో పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు ప్రపంచమంతా మనవైపు చూస్తోంది. పిరికితనంతో మనం ఆత్మహత్యలు చేసుకుందామా..? ధైర్యంగా ముందుగా సాగి ఆత్మహత్యలు లేని బంగారు తెలంగాణను సాధించుకుందామా? జీవన పోరాటంలో విజయం సాధించడానికి మీతో నేను చేయి కలుపుతాను. రైతన్నా.. మీతో నేనున్నా..'' అని ఆయన అన్నారు.
ఈ లేఖను కరపత్రాల రూపంలో గ్రామాల్లో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ శాఖ, గ్రామ పంచాయతీల ద్వారా ఇంటింటికీ ఈ లేఖను చేరవేసి రైతులకు భరోసా కల్పించాలని నిర్ణయం తీసుకుంది.. ఇందులో సీఎం సందేశంతో పాటు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు, వ్యవసాయ రంగం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.












Click it and Unblock the Notifications