మద్యం షాపుల టెండర్లలో కీలక మార్పులు.. సీఎం రేవంత్ ప్లాన్ వెనుక!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ టెండర్ల విషయంలో కీలక మార్పులు చేయనుంది. నవంబర్ 30వ తేదీతో తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులు ముగియనుండడంతో కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్న ఎక్సైజ్ శాఖ అందులో భాగంగా టెండర్ల విషయంలో కీలక మార్పులు చేస్తోంది. తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
మద్యం టెండర్ ల ప్రక్రియపై ప్రభుత్వ నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2620 మద్యం షాపులు ఉన్నాయి. ఈ మద్యం షాపులకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే టెండర్ల ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఈసారి లైసెన్స్ గడువును రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచే దిశగా చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ టెండర్ కోసం వేసే దరఖాస్తుల నాన్ రిఫండబుల్ ఫీజును కూడా రెండు లక్షల నుండి మూడు లక్షలకు పెంచనున్నట్లు సమాచారం.

మద్యం టెండర్లకు మరింత స్పందన
ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ, దుకాణాల కేటాయింపు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇక ఈసారి మూడేళ్లకు పెంచాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దానికోసం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇక ఈ మార్పుల వల్ల టెండర్లకు మరింత స్పందన వస్తుందని ఫలితంగా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మద్యం షాపుల వార్షిక ఫీజుల్లోనూ మార్పులు
గతంలో టెండర్ల ద్వారా రాష్ట్రానికి 2, 460 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ఇప్పుడు అది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో మద్యం దుకాణాల వార్షిక ఫీజుల్లో కూడా మార్పులు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. గతంలో నగరాలలో 1.05కోట్ల రూపాయల వార్షిక ఫీజు, మునిసిపాలిటీలలో 60 నుంచి 80లక్షల రూపాయల వార్షిక ఫీజు ప్రభుత్వానికి రాగా, ఈసారి ఫీజుల్లో కూడా మార్పులు చేయాలని భావిస్తున్నారు.
వ్యాపార నిబంధనల్లో కీలక మార్పులు
దీంతో ఈ ఫీజులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక కొన్ని కొత్త మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. అవసరాన్ని బట్టి కొత్త దుకాణాలకు అనుమతులు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సమాలోచనలు చేస్తోంది. ఇదే సమయంలో వ్యాపార నిబంధనలలో కూడా కీలక మార్పులు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
టెండర్ల పట్ల వ్యాపార వర్గాల్లో ఆసక్తి
ఇక వచ్చేనెల ఆరంభంలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పదిహేను రోజుల పాటు దరఖాస్తులు స్వీకరించి అనంతరం లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయిస్తారని చెబుతున్నారు .ఈసారి టెండర్ల పట్ల వ్యాపార వర్గాల్లో ఆసక్తి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రభుత్వం తీసుకునే తాజా నిర్ణయాలు రేవంత్ సర్కార్ కు గణనీయంగా ఆదాయాన్ని పెంచుతాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications