భార్యాభర్తలు గొడవ పడి నాలుగేళ్ల చిన్నారిని చంపేశారు
ఖమ్మం: భార్యాభర్తల గొడవలో అమాయకుడైన నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. ఖమ్మం జిల్లా బొనకల్ మండలం జానకీపురంలో ఈ సంఘటన జరిగింది. విశాఖపట్టణం వాస్తవ్యులైన కృష్ణ,నాగమణి సుబాబుల్ మొక్కలు నాటడానికి జానకీపురం వచ్చి స్థిరపడ్డారు.
కుటుంబ సమస్యలపై వారిద్దర తరుచుగా గొడవ పడుతూ ఉండేవారు. కృష్ణ మంగళవారంనాడు కల్లు తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో వాదానికి దిగాడు. దాదాపు గంట పాటు ఇద్దరు గొడవ పడ్డారు.
సుబాబుల్ కర్రతో కృష్ణ నాగమణిని కొట్టడానికి ప్రయత్నించాడు. అయితే, దెబ్బ నాగమణి ఒడిలో కూర్చున్న నాలుగేళ్ల కూతురు సుప్రియపై పడింది. మద్యం మత్తులో ఉన్న కృష్ణ ఆ విషయాన్ని గుర్తించలేకపోయాడు.
సుప్రియ స్పృహ కోల్పోయింది. కూతురిని తీసుకుని నాగమణి వైరాలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అయితే, అప్పటికే ఆమె మరణించింది. సంఘటన జరిగిన కృష్ణ గ్రామం విడిచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.