తుమ్మల పలుకుబడిని కేటీఆర్ తట్టుకోలేకపోయారు: టీఆర్ఎస్ అసంతృప్త నేత సంచలనం
ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు కొద్దిరోజుల ముందు తెరాసకు గట్టి షాక్ తగిలింది. పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బుడాన్ బేగ్ పార్టీని వీడుతున్న విషయం తెలిసిందే. ఖమ్మంలో ఈ నెల 28న నిర్వహించే ప్రజాకూటమి బహిరంగ సభావేదికగా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2014 ఎన్నికల్లో తెరాస తరఫున ఖమ్మం లోకసభ స్థానానికి పోటీ చేశారు. తెరాస ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్నారు.
ఆయన పార్టీని వీడుతున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ నాలుగున్నరేళ్లు రాష్ట్రాన్ని ఓ నియంతలా పాలించారని బుడాన్ బేగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రులను కలవని ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోతారని చెప్పారు.
కెటిఆర్కు తుమ్మల షాక్: సిఎంగా అంగీకరించనని ప్రకటన
కేసీఆర్ బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయారు
కేసీఆర్ పూర్తిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేతుల్లోకి వెళ్లిపోయారని విమర్శలు ఆయన గుప్పించారు. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పని చేస్తానని బుడాన్ బేగ్ చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ ఎంతో ఊదరగొట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడ, కేసీఆర్ ఎక్కడ అని నిలదీశారు.
తుమ్మలకు అనుకూలంగా వ్యాఖ్యలు
ప్రభుత్వంలో ఆత్మగౌరవం, అభివృద్ధి లేనేలేదని బుడాన్ బేగ్ చెప్పారు. కేసీఆర్, తెరాస నేతలు అన్నీ మాటలే చెబుతున్నారని, కానీ అభివృద్ధి మాత్రం లేదన్నారు. ఈ సందర్భంగా ఆయన తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావుకు అనుకూలంగా మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో పదికి 10 సీట్లు గెలిపించే సత్తా తుమ్మలకు ఉందని చెప్పారు.
తుమ్మల పలుకుబడిని కేటీఆర్ తట్టుకోలేకపోయారు
అయితే తుమ్మల పలుకుబడిని మంత్రి (ఆపద్ధర్మ) కేటీఆర్ తట్టుకోలేకపోయారని బుడాన్ బేగ్ తెలిపారు. (కాగా, గతంలో తాను కేటీఆర్ను సీఎంగా అంగీకరించనని తుమ్మల చెప్పారు.) తుమ్మలకు కౌంటర్గా మరికొందరు నేతలను నేతలను రంగంలోకి దించారని ఆరోపించారు. తద్వారా పార్టీని చేతులారా నిర్వీర్యం చేసుకున్నారన్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు ఒక సీటు దక్కితే గొప్ప విషయమన్నారు.
కేసీఆర్ను కలవాలనుకుంటే
కేసీఆర్ను కలవాలని తాను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నానని, కానీ మంత్రులకే దిక్కులేదన్నారు. అపాయింట్మెంట్ కోసం సీఎం కేసీఆర్కు తాను వందలసార్లు ఫోన్ చేశాననీ, మెసేజ్ పెట్టానని చెప్పారు. అయినా కేసీఆర్ నుంచి కనీస స్పందన రాలేదని బుడాన్ బేగ్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేక తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పారు.