షర్మిల కుమారుడు కిడ్నాప్: 6గం.కు ఇంటి ముందు లేఖ.. ఏముంది అందులో?
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి కుమారుడి కిడ్నాప్ ఉదంతంలో అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. కిడ్నాప్ చేసిన వ్యక్తి బాలుడు తప్పించుకుంటుంటే అడ్డుకోకపోవడం.. ఎత్తుకెళ్లిన క
రాజమండ్రి: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి కుమారుడి కిడ్నాప్ ఉదంతంలో అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. కిడ్నాప్ చేసిన వ్యక్తి బాలుడు తప్పించుకుంటుంటే అడ్డుకోకపోవడం.. ఎత్తుకెళ్లిన కారును కూడా తిరిగి తీసుకెళ్లమంటూ ఓ లేఖలో సమాచారం ఇవ్వడం కేసును మలుపు తిప్పుతోంది.
దీపావళి పండుగ నేపథ్యంలో.. షర్మిలారెడ్డిని మానసికంగా ఇబ్బందికి గురిచేసేందుకు తెలిసినవాళ్లే ఈ పని చేసి ఉంటారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా అగంతకులే కిడ్నాప్ చేసి ఉంటే డబ్బు కోసమో.. మరే విషయంలోనైనా బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఆ పనికి పూనుకునేవారు.. కానీ ఈ కిడ్నాపర్ డబ్బు కోసం చేయలేదని స్పష్టంగా అర్థమవుతోంది.
అసలేం జరిగింది?:
బుధవారం రాత్రి 9గం. సమయంలో షర్మిలా రెడ్డి ఏవీ అప్పారావు రోడ్డులోని తన రెస్టారెంట్ నుంచి తన కుమారుడితో కొత్తగా కొనుగోలు చేసిన ఇన్నోవా కారులో ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో కుమారుడిని కారులోనే ఉంచిన ఆమె.. ఇంట్లో ఉన్న కుమార్తెను తీసుకురావడానికి లోపలికి వెళ్లారు. ఇంతలోనే ఎక్కడినుంచి వచ్చాడో కానీ ఓ అగంతకుడు కారులోకి చొరబడ్డాడు. బాలుడితో సహా కారును ఎత్తుకెళ్లాడు.
దూకేసిన బాలుడు:
బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న సమయంలో.. నిన్నేం చేయాలో చెప్పు? అంటూ బాలుడిని ప్రశ్నించడం, బాలుడు కారు నుంచి దూకేస్తున్నా అడ్డుకోకపోవడం బట్టి చూస్తుంటే.. అతను కిడ్నాపర్ కాదనే అనుమానం కలుగుతోంది. కారు డోర్లు లాక్ చేసే అవకాశం ఉన్నా అతను అలా చేయలేదు. బాలుడు కారు నుంచి దూకడం కోసమే నగరంలోని ఎపెక్స్ ఆస్పత్రి వద్ద వాహన వేగం తగ్గించి ఉంటాడా? అన్న అనుమానం కూడా కలుగుతోంది.
ఎవరై ఉంటారు?:
నిజంగా డబ్బు కోసమో.. లేక బ్లాక్మెయిల్ కోసమో బాలుడిని కిడ్నాప్ చేసి ఉంటే, ఇంత ఈజీగా బాలుడు తప్పించుకునే అవకాశం కల్పించకపోయేవారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీపావళి పండుగ నేపథ్యంలో రాజకీయ నేత అయిన షర్మిలా రెడ్డిని మానసికంగా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో తెలిసినవారే ఈ కిడ్నాప్ ఉదంతానికి తెరదీశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిలారెడ్డితో వ్యక్తిగత విభేదాలు లేదా కుటుంబ విభేదాలు ఉన్నవారెవరైనా ఈ చర్యకు పాల్పడి ఉంటారన్న అనుమానాలు కూడా తెర పైకి వస్తున్నాయి.
ఇంటి ముందు లేఖ:
గురువారం తెల్లవారు జామున 6 గంటలకు షర్మిలా రెడ్డి ఇంటిముందు పోలీసులకు ఓ లేఖ దొరకడం మరో ట్విస్ట్. నిజానికి ఆరోజు తెల్లవారుజామున 3గం. వరకు పలువురు రాజకీయ నేతలు, నగర ప్రముఖులు షర్మిలా రెడ్డి ఇంటి వద్దే ఉన్నారు. పోలీసులు 4గం. వరకు అక్కడే ఉన్నారు. 6గం.కు షర్మిలారెడ్డి ఇంటి ముందు లేఖ వదిలారంటే.. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరనే సమాచారం అగంతకుడికి ఎవరైనా అందించి ఉండాలి. లేదా అగంతకుడి తరుపున మరెవరైనా అక్కడ లేఖ వదిలేసి ఉండాలి.
కారు ఆచూకీ:
బాలుడు దూకేసిన తర్వాత కారుతో వెళ్లిపోయిన అగంతకుడు వాహనాన్ని గోకవరం సమీపంలో వదిలేసి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని తాను రాసిన లేఖలోను చెప్పాడు. ఇటీవలే షర్మిలారెడ్డి రూ.18లక్షలతో ఆ ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేశారు. కొత్త వాహనాన్ని కూడా అగంతకుడు వదిలేసి వెళ్లాడంటే.. అతను దొంగ కూడా కాదన్న విషయం స్పష్టమవుతోంది. దీంతో అతనెవరై ఉంటారా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.