హైదరాబాద్లో ఫిష్ ట్రేడర్ దారుణం హత్య.. చంపి గోనెసంచిలో కుక్కి..
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దారుణం చోటు చేసుకుంది. జవహర్నగర్లోని ఓ ఇంట్లో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఇంట్లో నుంచి కుళ్లిపోయిన వాసన వస్తుందని.. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూడగా.. ఓ వ్యక్తిని హత్య చేసి గోనె సంచిలో కుక్కినట్టు గుర్తించారు. మృతుడిని బోరబండకు చెందిన చేపల వ్యాపారి రమేష్గా గుర్తించారు. రమేష్ను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేసినట్టు తెలుస్తోంది.
అసలేం జరిగింది..
బోరబండలోని రామారావునగర్కి చెందిన రమేష్(45) అనే చేపల వ్యాపారి ఇటీవల ఈఎస్ఐ ఆసుపత్రి సమీపంలో గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసినట్టు పోలీసులకు కటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరపగా.. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని జవహర్నగర్లో ఉన్న ఓ ఇంట్లో అతని మృతదేహాన్ని గుర్తించారు.
కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్...
ఈ నెల 1వ తేదీ రాత్రి 8గంటలకు ఓ మహిళ నుంచి ఫోన్ కాల్ రావడంతో రమేష్ బయటకెళ్లాడని.. ఆ తర్వాత కొద్దిసేపటికే కిడ్నాప్కు గురయ్యాడని కుటుంబ సభ్యులు పోలీసులతో చెప్పారు. కిడ్నాప్ అయిన మరుసటిరోజు రమేష్ సెల్ఫోన్ నుంచి అతని మేనకోడలికి వాట్సాప్ మెసేజ్ వచ్చిందని చెప్పారు. రూ.1కోటి ఇవ్వాలని,లేనిపక్షంలో రమేష్ను చంపేస్తామని అందులో పేర్కొన్నట్టు తెలిపారు. దీంతో కిడ్నాపర్ల ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించారు. ఎట్టకేలకు జూబ్లీహిల్స్లో అతను హత్యకు గురైనట్టు గుర్తించారు.
ఎవరిపై అనుమానం..
హత్యకు గురైన ఇంట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి 15 రోజుల క్రితమే అద్దెకు దిగినట్టు ఇంటి యజమాని తెలిపారు. ఓ మహిళను తన భార్యగా పరిచయం చేసి.. ఆమెతో పాటు ఇంట్లో ఉన్నాడని చెప్పారు. వారితో ఓ పిల్లాడు కూడా ఉన్నట్టు చెప్పారు. అయితే రమేష్ను శ్రీనివాసే తన గదికి పిలిపించి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితమే అతన్ని హత్య చేసి.. డబ్బుల కోసం వాట్సాప్ మెసేజ్లు చేసినట్టుగా అనుమానిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తు...
చేపల వ్యాపారంలో బాగా సంపాదించిన రమేష్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. రమేష్ సంపాదన గురించి తెలిసిన అతని స్నేహితులు లేదా సన్నిహితులే రమేష్ను హత్య చేయించి ఉంటారని అనుమానిస్తున్నారు. రమేష్ సెల్ఫోన్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.