ఫేస్బుక్ సాయంతోనే అతని అరెస్టు: ముంబైవాసి కోసం గాలింపు
నల్లగొండ: అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ను తెలంగాణలోని నల్లగొండ జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. దేశవ్యాప్తంగా 12కు పైగా రాష్ట్రాలకు సంబంధించిన ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిన 20 రోజుల్లోగా కీలక సూత్రధారిని పట్టుకున్నారు.
ఇంటర్నెట్ సాయంతో గత ఏడేళ్లుగా కిడ్నీ మాఫియాను తయారు చేసిన జాతీయ స్థాయి కీలక ఏజెంట్ గుజరాత్కు చెందిన సురేష్ ప్రజాపతిని పట్టుకునేందుకు నల్లగొండ పోలీసులు ఆన్లైన్ను వాడుకున్నారు. అతనికి సహకరిస్తున్న దిలీప్ ఉమేదమాల్ చౌహన్ను అహ్మదాబాద్లో అరెస్టు చేశారు.
మీడియాలో వచ్చిన కథనాల మేరకు - కిడ్నీల రాకెట్ సూత్రధాని సురేష్ ప్రజాపతిని అహ్మదాబాదులోని అడి ఇంటిలోని వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ రాకెట్లో నల్లగొండకు చెందిన కస్పరాజు సురేష్, తదితరులు అరెస్టయిన విషయం సురేష్ ప్రజాపతికి తన అరెస్టుకు ముందే తెలిసింది.
దాంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా తాను ఆన్లైన్లో పెట్టిన నెంబర్ను వాడడం మానేశాడు. ఆహ్మదాబాదులోని తన కార్యాలయానికి తాళం వేసాడు. కొంత కాలం గుట్టు చప్పుడు కాకుడంా ఉందామనే ఆలోచనతో తన సహచరులను అప్రమత్తం చేశాడు.
నల్లగొండ పోలీసులు ప్రజాపతి ఉపయోగించిన ఫేస్బుక్ ఖాతాలోకి ఓ నెంబర్ సాయంతో ప్రవేశించి అతని మిత్రుల జాబితాను ట్రాప్ చేశారు. ఆ తర్వాత మిత్రుల జాబితాలోంచి ప్రజాపతి మిత్రులను ఎంచుకుని వారిని సంప్రదించారు.
పూర్తి సమాచారం రాబట్టిన తర్వాత అహ్మదాబాదుకు వెళ్లి అక్కడ గాలం వేశారు. ప్రజాపతి ఇంటిని కనిపెట్టారు. అతడు ఇంట్లో ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాత అతను ఉపయోగించే ఐసిఐసిఐ బ్యాంకు నుంచి కొరియర్ వచ్చిందంటూ తలుపు తట్టారు.
తలుపు తీసిన వెంటనే కొరియర్ వచ్చిందని చెప్పి మంచినీళ్లు కావాలని అడిగి ఇంటిలోకి ప్రవేశించారు. ఇంట్లో సురేష్ ప్రజాపతి కనిపించడంతో అరెస్టు చేశారు. కిడ్నీ రాకెట్ మరో కీలక ఏజెంట్ను కూడా ఆన్లైన్ ద్వారా ట్రాక్ చేశారు.
అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యక్తిని ఎరగా వేసి దిలీప్ను పట్టుకున్నారు. ఓ స్థానికుడి ద్వారా ఆన్లైన్లో ఉన్న నెంబర్కు ఫోన్ చేయించి కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, ఫలానా చోటుకు రావాలని సమాచారం అందించారు. దిలీప్ వెంటనే ఆ వ్యక్తి చెప్పిన చోటుకి వచ్చాడు, దాంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ప్రజాపతి ఇచ్చిన సమాచారం మేరకు మరో కీలక నిందితుడు కేసులో అరెస్టు కావాల్సి ఉంది. అతను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. ఆ రాకెట్లో మరో కీలక వ్యక్తి ముంబైకి చెందినవాడు. ఇతుడు సురేష్ ప్రజాపతికి కుడిభుజమని చెబుతారు. దక్షిణ భారతదేశం నుంచి ఎవరు వచ్చినా శ్రీలంకకు తీసుకుని వెళ్లి కిడ్నీలు మార్పించే వ్యక్తి అతనేనని సమాచారం. వీరిద్దరినీ అరెస్టు చేస్తే కిడ్నీ విక్రేతలు, గ్రహీతలు వంద మంది దాకా బయటకు వస్తారని భావిస్తున్నారు.
శ్రీలంక చర్యలు..
కాగా, శ్రీలంక ప్రభుత్వం కిడ్నీ రాకెట్పై దృష్టి సారించింది. ఆ ప్రభుత్వం కూడా దర్యాప్తు ప్రారంభించినట్లు అక్కడి పోలీసులు నల్లగొండ పోలీసులకు సమాచారం అందించారు. కిడ్నీ మార్పిడి ప్రక్రియను ఆస్పత్రులలో నిషేధించినట్లు తెలుస్తోంది.