కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయి, నీచంగా ఆ సీపీ: సంజయ్తో కిషన్ రెడ్డి, ఈటల భేటీ
హైదరాబాద్/కరీంనగర్: కరోనా నిబంధనలు బీజేపీకి మాత్రమే వర్తిస్తాయా? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన బీజేపీ కార్యాలయంపై పోలీసులు దాడి చేశారని నిలదీశారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి కరీంనగర్ జైలులో ములాఖత్ అయ్యారు. బండి సంజయ్తో మాట్లాడారు.
ఇంతిటి నియంతృత్వమా?: కేసీఆర్ సర్కారుపై కిషన్ రెడ్డి ఫైర్
జాగరణ కార్యక్రమం సమయంలో అరెస్టు చేసిన తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆయనను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. తదుపరి బండి సంజయ్ కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అక్రమ కేసులకు బీజేపీప భయపడదని అన్నారు. ఇలాంటి రాచరిక, నియంతృత్వ పాలన కోసమే ఉద్యమం చేశామా? ఢిల్లీలో ఏడాదిపాటు రైతులు ఉద్యమం చేసినా కేంద్రం అడ్డుకోలేదన్నారు. బీజేపీ నేతలను కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని మండిపడ్డారు. కరోనా నిబంధనల సాకుతో తప్పుడు కేసులు పెడుతున్నారని, కోవిడ్ నిబంధనలు బీజేపీ భవనానికి మాత్రమే వర్తిస్తాయా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
కేసీఆర్ నిజాం పాలనకు చరమగీతం: కిషన్ రెడ్డి వార్నింగ్
ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ అరెస్టులతో బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారని.. టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులకు బెదిరే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి. బీజేపీ కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి నిర్భంధం, నియంతృత్వం చూడలేదన్నారు. కేసీఆర్ తీరు నిజాం పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం, మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న కిషన్ రెడ్డి.. తెలంగాణ సమాజం నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతుందని హెచ్చరించారు.
Recommended Video
కేసీఆర్, కరీంనగర్ సీపీపై ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు
హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని దీక్ష చేపట్టిన బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. సీఎం ఆదేశాలతోనే పోలీసులు నీచంగా ప్రవర్తించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ చివరికి కానిస్టేబుల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన, నీచమైన చర్య. ఈ అరెస్ట్ను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యే విధంగా ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు గందరగోళంగా ఉన్నాయి. ప్రభుత్వ అనాలోచిత బదిలీల వల్ల భర్త ఓ దగ్గర, భార్య మరో దగ్గర, పిల్లలు ఇంకో దగ్గర ఉండాల్సి వస్తోంది. దీని వల్ల కుటుంబాలు చెల్లాచెదురు అయ్యాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల పట్ల బాధ్యతతో బండి సంజయ్ కోవిడ్ నిబంధనల మేరకు దీక్ష చేపట్టారు. అయినా అనుమతులు లేవని ఆయనను అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతోనే కరీంనగర్ సీపీ, పోలీసులు నీచంగా ప్రవర్తించారు. ఇది రాజరిక వ్యవస్థ కాదు. ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. మమ్మల్ని ఇబ్బంది పెడితే పెట్టారు.. కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేయకండి. మేం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
సీఎం, మంత్రుల సమావేశాలకు కరోనా నిబంధనలు విర్తించవా?
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. సీఎం, మంత్రుల మీటింగ్స్ కి కోవిడ్ నిబంధనలు వర్తించవా ? అని ప్రశ్నించారు . బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు నియంతృత్వమన్నారు. బండి సంజయ్ చాలా ధైర్యంగా ఉన్నారని... 317 జీవో సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. టీచర్ల సమస్యలను పరిష్కరించాలంటూ బండి సంజయ్ జనవరి 2న రాత్రి దీక్షకు దిగారు. అయితే ఆ దీక్షకు అనుమతులు లేవంటూ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం కోర్టు బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో బీజేపీ శ్రేణులు 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. జిల్లా, మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొనాలని తెలిపాయి. ఇందులో భాగంగా దీక్షలలో పాల్గొనడానికి వెళ్తున్న నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నాయి. కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ లో క్యాండిల్ ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదంటున్నారు పోలీసులు.